మహారాష్ట్రలో బీజేపీకి రాజ్ ఠాక్రే కలసి వస్తారా ?

మహారాష్ట్ర ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాషాయ దళం శపధం పట్టింది.

Update: 2024-10-17 04:02 GMT

మహారాష్ట్ర ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాషాయ దళం శపధం పట్టింది. 2019లో గెలిచింది కానీ శివసేనతో కలపి కూటమి కట్టినా చివరికి శివసేన అధికారం కోరుకోవడం ముఖ్యమంత్రిగా తమకే చాన్స్ ఇవ్వలాని పట్టు బట్టడంతో ఆ బంధం చీలిపోయింది.

ఆ మీదట శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే అనూహ్యంగా కాంగ్రెస్ తో జట్టు కట్టి శరద్ పవార్ తో చెట్టాపట్టాల్ వేసుకుని రెండేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా అధికారం అందుకున్నారు. ఇక ఆయన పార్టీనే చీల్చి ఏక్ నాధ్ షిండేని సీఎం చేసి శరద్ పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ ని తమ తోడు తెచ్చుకుని గడచిన రెండేళ్ళుగా బీజేపీ కూటమి కట్టి రాజ్యం చేస్తోంది.

సరే అధికారంలో ఉంది కాబట్టి ఎన్ని చేసినా చెల్లిపోయాయి.ఇపుడు అసలైన ఘట్టం వచ్చిపడింది. నవంబర్ 20న మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నాయి. మంచి ఫైర్ మీద ఉన్న ఉద్ధవ్ ఠాక్రే శివసేన శరద్ పవార్ ఎన్సీపీ కాంగ్రెస్ కలసి ఈసారి అధికారం మాదే అని సవాల్ చేస్తున్నాయి.

బీజేపీకి ప్రభుత్వంలో ఉండడం వల్ల యాంటీ ఇంకెంబెన్సీ ఉంది. పైగా పార్టీలను చీల్చి అధికారంలోకి వచ్చారు అన్న అపప్రధ ఉండనే ఉంది. దాంతో బీజేపీ కూటమి ఎలా నెగ్గుతుంది అన్నది అందరికీ టెన్షనే. అయితే బీజేపీ కూటమిని అడగకుండానే వరమిచ్చే వేలుపుగా రాజ్ ఠాక్రే కనిపిస్తున్నారు అని అంటున్నారు.

ఆయన ఎవరో కాదు ఉద్ధవ్ ఠాక్రే కి వరసకు తమ్ముడు. దివంగత నేత బాల్ థాక్రేకు అన్న కుమారుడు. అన్నీ సవ్యంగా ఉంటే ఆయనే శివసేనకు అసలైన వారసుడు కావాల్సింది. అయితే 2005 తరువత ఉద్ధవ్ ఠాక్రే రాజకీయాల్లోకి వచ్చి చురుకుగా పాల్గొనడంతో సొంత కొడుకుని పక్కన పెట్టుకున్నారు బాల్ ఠాక్రే. దాంతో రాజ్ ఠాక్రే పక్కకు వెళ్ళిపోయారు.

ఆయన మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పేరుతో పార్టీ పెట్టినా పెద్దగా వికసించలేదు. అయితే ఉద్ధవ్ ఠాక్రే బాల్ ఠాక్రే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తో చేతులు కలపడం ఆయన పార్టీ రెండుగా చీలిపోవడంతో బాలా సాబ్ ఆశయాలు నెరవేర్చే పార్టీ తనదే అని రాజ్ ఠాక్రే క్లెయిం చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు.

మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉన్న మహరాష్ట్రలో రాజ్ ఠాక్రే పార్టీ 250 పైగా దాకా పోటీ చేయాలని చూస్తోంది. దాంతో మహారాష్ట్రలో బహుముఖ పోటీ జరిగే చాన్స్ ఉంది. అటు కాంగ్రెస్ కూటమికి ఇటు బీజేపీ కూటమికి పోరు సాగితే ఫలితం అటో ఇటో తేలిపోయేది.ఇపుడు రాజ్ ఠాక్రే వచ్చి మొత్తం సీట్లకు పోటీ పెడతాను అనడంతో ఆయన చీల్చే ఓట్లు ఎవరివీ అన్న చర్చ వస్తోంది

కొత్త పార్టీ వస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయి. దాంతో పాటు శివసేన సంప్రదాయ ఓట్లకు కూడా రాజ్ ఠాక్రే గండి కొడతారా అన్న చర్చ ఉంది. ఈ పరిణామం ఏదైనా కలసి వస్తుందేమో అని బీజేపీ పెద్దలు కూడా చూస్తున్నారుట. రాజ్ థాక్రే రూపంలో ఏ మాత్రం మేలు జరిగినా తాము బయట పడిపోవచ్చు అని కూడా ఆలోచిస్తున్నారుట. మరి రాజ్ ఠాక్రే నిజంగా ఆ స్థాయిలో ఓట్లు చీలుస్తారా బీజేపీకి మేలు చేస్తారా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నరు.

Tags:    

Similar News