ఏపీ సీఎంగా జగన్ ఉంటే రేవంత్ కలిసేవారా? కేసీఆర్ ఉంటే సీఎం బాబు కలిసేవారా?

ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కకపోవడంతో ఇప్పుడు వైసీపీ అధినేతగా మాత్రమే మిగిలారు.

Update: 2024-07-04 00:30 GMT

సరిగ్గా ఆరంటే ఆరు నెలల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయం మొత్తం మారిపోయింది. డిసెంబరు 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగా.. జూన్ 4న ఏపీ ఫలితాలు వెలువడ్డాయి. అంటే సరిగ్గా ఆరు నెలలు. తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ సీఎం అయిపోగా.. ఏపీలో వై నాట్ 175 అంటూ ఎన్నికలకు వెళ్లిన సీఎం జగన్ 151 స్థానాల నుంచి 11కు పడిపోయారు. ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కకపోవడంతో ఇప్పుడు వైసీపీ అధినేతగా మాత్రమే మిగిలారు.

అటు ఇటు.. బద్ధ విరోధులు

తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బద్ధ విరోధి. అలాగే ఏపీలో జగన్ కలలో కూడా చంద్రబాబుది పైచేయి కానివ్వనంత విరోధం. అయితే, ఇప్పుడు పరిస్ధితి తారుమారై ముందు రేవంత్, తర్వాత బాబు సీఎంలయ్యారు. అంతేకాదు.. అటు కేంద్రంలోనూ కేసీఆర్, జగన్ పలుకుబడి బాగా పడిపోయింది. ఇక డిసెంబరులో తెలంగాణలో రేవంత్ సీఎం అయినప్పుడు ఏపీలో సీఎంగా ఉన్న జగన్ కనీసం అభినందనలు తెలపలేదు. ఆ తర్వాత కూడా ఆయన కనీసం ఫోన్ చేయలేదు. కాగా, ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ కిందపడి తుంటి విరగగా ఆయనను హైదరాబాద్ వచ్చి మరీ పలకరించారు. కానీ.. రేవంత్ తో మాట కలపలేదు. భేటీ ఆలోచన కూడా చేయలేదు. ఇప్పుడు జగన్ మాజీ సీఎం కావడంతో రేవంత్ తో మాట్లాడే అవసరమే లేదు.

Read more!

రెండో విడతలో బాబు-కేసీర్ దూరం

2014లో ఉమ్మడి ఏపీ విభజన అనంతరం అటు ఏపీలో చంద్రబాబు, ఇటు తెలంగాణలో కేసీఆర్ సీఎంలు అయ్యారు. ఓటుకు నోటు విషయంలో రేవంత్ రెడ్డి అరెస్టు, కేసీఆర్ తీవ్ర విమర్శలకు దిగడం తదితర కారణాలతో వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత చంద్రబాబు పాలనను ఏపీకి మార్చేశారు. 2015లో ఏపీ రాజధానిగా అమరావతికి శంకుస్థాపనకు కేసీఆర్ స్వయంగా హాజరయ్యారు. అదే 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సందర్భంలో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు.. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మహా కూటమి ఏర్పాటు చేసి బరిలో దిగారు. ఇది కేసీఆర్ కు ఆగ్రహం తెప్పించింది. పార్టీ గెలుపు అనంతరం మీడియా సమావేశంలో చంద్రబాబు మీద నిప్పులు చెరిగారు. దీంతో 2019 ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేశారనే పేరుంది. 2018 ఎన్నికల్లో కేసీఆర్ రెండోసారి సీఎం కాగా, 2019లో చంద్రబాబు ఓడిపోయారు. తద్వారా వీరి భేటీకి చాన్స్ లేకుండా పోయింది. ఏపీలో సీఎం జగన్ మాత్రం పలుసార్లు కేసీఆర్ తో సమావేశం అయ్యారు. ప్రైవేటు కార్యక్రమాల్లోనూ కలిసి పాల్గొన్నారు. చంద్రబాబును మాత్రం దగ్గరకు రానీయలేదు.

పైన చెప్పుకొన్నదంతా పరిశీలిస్తే.. ఏపీలో జగన్ మళ్లీ గెలిస్తే రేవంత్ రెడ్డితో భేటీ అయ్యేవారా? తెలంగాణలో కేసీఆర్ మళ్లీ గెలిస్తే చంద్రబాబుతో సమావేశం అయ్యేవారా? అనేది ప్రశ్న. దీనికి జవాబు.. ''నో'' అనే చెప్పాలి.

Tags:    

Similar News

eac