ఇదేం దుర్మార్గం? పెళ్లి తర్వాత కన్యత్వ పరీక్ష.. ఆమెకు రూ.10లక్షలు ఫైన్

Update: 2022-09-06 04:59 GMT
వినేందుకే చిత్రం గా ఉండే కొన్ని దురాచారాలు మన చుట్టూ ఉంటాయి. తాజాగా అలాంటిదే ఒకటి బయటకు వచ్చింది. దక్షిణ భారతంతో పోలిస్తే.. ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో నెలకొన్న ఆచారాలు.. వాటి పేరుతో సాగే ఆరాచకాలు అన్ని ఇన్ని కావన్నట్లుగా ఉంటుంది.

రాజస్థాన్ లోని ఒక తెగ వారు పెళ్లి తర్వాత అమ్మాయికి కన్యత్వ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ఫెయిల్ అయితే.. భారీ ఎత్తున ఫైన్ విధిస్తుంటారు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది.

రాజస్థాన్ లోని మేవార్ ప్రాంతంలోని బిల్వారా జిల్లాకు చెందిన బాగోర్ లో 24 ఏళ్ల యువతికి తాజాగా పెళ్లైంది. నూతన వధువు అత్తారింట్లో కాలు పెట్టినంతనే ఆమెకు.. కన్యత్వ పరీక్షను నిర్వహించారు. దీన్ని అక్కడ కుకుడీ ఆచారంగా పేర్కొంటారు. ఈ పరీక్షలో సదరు యువతి విఫలమైంది. దీంతో.. ఆమెపై అత్తింటి వారు భౌతిక దాడి చేసి.. ఇంటి నుంచి బయటకు పంపేశారు.

అంతేకాదు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగేలా చేశారు. అయితే.. సదరు బాధిత మహిళను తన చిన్నతనంలో ఎదురింటి కుర్రాడు అత్యాచారం చేయటం.. దానిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయటం లాంటివి చోటు చేసుకున్నాయి. ఆ విషయాలన్ని పెద్దల ముందు ఎకరువు పెట్టుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ వినని పంచాయితీ పెద్దలు.. ఆమెకు రూ.10 లక్షలు ఫైన్ విధిస్తూ తీర్పును ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ఈ దురాచారానికి సంబంధించిన ఉదంతం బయటకు రావటం.. పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. ఈ ఆచారం మీదా.. ఈ తీర్పు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

భర్త.. అత్తమామలతో  పాటు పెద్దలుగా వ్యవహరించిన వారిపైనా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తన తప్పు లేకుండా.. ఒకడి రాక్షసత్వానికి నలిగిపోయిన పాపానికి.. అందరి ముందు తల దించుకోవాల్సి రావటం.. దోషిగా నిలబడాల్సి రావటానికి మించిన దారుణం ఇంకేం ఉంటుంది చెప్పండి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News