శ్రీవారి భక్తులకు అలర్ట్.... అలిపిరి మెట్ల మార్గం మూసివేత !

Update: 2021-06-01 06:31 GMT
ఆ శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లే భక్తులకు రెండు నెలల పాటు అలిపిరి మెట్ల మార్గం అందుబాటులో ఉండదని తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేందుకు జూన్ 1 నుంచి జూలై 31 వరకు ఆ మార్గాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. దీనితో తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లాలని సూచించింది.

దీనితో అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సుల ద్వారా భక్తులను పంపేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ సిబ్బందికి సహకరించాలని టీటీడీ విజ్నప్తి చేసింది. మరోవైపు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద నేటి నుంచి ఫాస్టాగ్‌ అమల్లోకి రానుంది. ఇప్పటికే తిరుమల-తిరుపతి మధ్య టాక్సీవాలాలతో సమావేశమైన అధికారులు ఫాస్టాగ్‌ అమలుపై సమీక్ష నిర్వహించారు. దీనితో పాటు పెంచిన కొత్త టోల్‌ చార్జీలను నేటి నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు. గతంలో బైక్‌ లకు 2 రూపాయల చార్జీ వసూలు చేస్తుండగా, ఇకపై వాటిని ఉచితంగానే అనుమతిస్తారు. నాలుగు చక్రాల వాహనాలకు గతంలో రూ.15 ఛార్జీ ఉండగా నేటి నుంచి 50 రూపాయలు వసూలు చేయనున్నారు.




Tags:    

Similar News