అంబానీ.. అదానీ.. ప్రముఖులంతా పరుగులు పెడుతున్నారా?

Update: 2021-05-01 03:30 GMT
అనుకోని కష్టం వచ్చినప్పుడు అపర కుబేరులు ఏం చేస్తారు? తిరుగులేని ఆర్థిక స్తోమత ఉన్న వారంతా.. తమ ప్రాణాలకు ఇచ్చే విలువ ఎంతన్న విషయాన్ని కళ్లకు కట్టేలా చేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏం చేయాలన్నా ముందు బతుకైతే ఉండాలన్నట్లుగా వారి తీరు ఇప్పుడు వార్తాంశంగా మారింది. కరోనా కష్టకాలంలో దేశం యావత్తు కిందామీదా పడుతున్న సంగతి తెలిసిందే. దేశంలోని మరే మహానగరంలో లేని రీతిలో ముంబయిలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఇలాంటివేళ.. అపర కుబేరులు.. దేశంలో అత్యంత సంపన్నులు.. పారిశ్రామికవేత్తలు పలువురు ముంబయిలోనే ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు సురక్షిత ప్రాంతాల్ని వెతుక్కుంటూ వెళ్లిపోయిన వైనం షాకింగ్ గా మారింది. వేలాది కోట్ల వ్యాపార సామ్రాజ్యాల్ని ఏలుకోవటానికి ప్రాణాలు ముఖ్యమైన వేళ.. కరోనా కోరలకు చిక్కకుండా ఉండేందుకు వారు సదూర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.

ప్రపంచ టాప్ టెన్ కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం తాజాగా ముంబయిలోని తమ లగ్జరీ నివాసాన్ని వదిలేసి.. గుజరాత్ లోని అతి తక్కువ జనసాంద్రత ఉన్న జామ్ నగర్ ప్రాంతంలోని తమ నివాసానికి వెళ్లిపోయారు. కరోనాకు దూరంగా ఉండాలన్న తలంపుతో వారీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.

అతి తక్కువ వ్యవధిలో అత్యంత సంపన్నుడిగా మారిన వ్యాపార సంచలనం గౌతం అదానీ.. దేశంలో ముకేశ్ అంబానీ తర్వాతి స్థానం ఆయనదే. అలాంటి ఆయన కూడా తన కుటుంబాన్ని తీసుకొని ముంబయి నుంచి వెళ్లిపోయారు. ఆయన కూడా గుజరాత్ రాజధాని అహ్మదాబద్ శివారులో ఉన్న తమ ఇంటికి వెళ్లిపోయారని చెబుతున్నారు.

కరోనా భయంతో ఇలా ప్రముఖ పారిశ్రామిక.. వ్యాపార వేత్తలు పలువురు తాము ఉండే నివాసాల్ని వదిలేసి.. కరోనా ముప్పు తక్కువగా ఉండే ప్రాంతాలకు వెళుతున్నారు. ఇన్ఫోసిస్ సహ ఛైర్మన్ క్రిస్ గోపాలక్రిష్ణన్ ఐపీఎల్ ఆటగాళ్లు ఏ రీతిలో అయితే.. బయో బబుల్ లో ఉన్నారో.. తన సిబ్బందితో సహా ఆయన ఉండిపోయారు. తమ సిబ్బంది వండిన వంటలకే పరిమితమవుతూ.. మిగిలిన ప్రపంచంతో సంబంధాల్ని పూర్తిగా తెంచుకున్నట్లు చెబుతున్నారు.

ఆయనతో పాటు ఇన్ఫోసిస్ కు చెందిన మరో ప్రముఖుడు నందన్ నీలేకని సైతం బెంగళూరులోని తమ బయోబబుల్ కు పరిమితమైనట్లు చెబుతున్నారు. ఇలా.. దేశంలోని పలువురు ప్రముఖులు.. తమ రోజువారీ కార్యకలాపాల్ని పూర్తిగా పక్కన పెట్టేసి.. కరోనాకు చిక్కకుండా ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకొని వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు. ప్రజలంతా కష్టకాలంలో ఉన్న వేళ.. వ్యాపారాల్ని వదిలేసి వెళ్లిపోయిన వైనం చూస్తే.. సంపన్నుల తీరు షాకివ్వక మానదు.
Tags:    

Similar News