కేసీఆర్ సర్కారుపై బండి ఎఫెక్టు.. యుద్ధ ప్రాతిపదికన క్రేన్లు ఏర్పాట్లు

Update: 2022-09-08 08:12 GMT
ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో చురుకు పుట్టించటంలో సక్సెస్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. తాను ఒకసారి డిసైడ్ అయ్యాక.. ఎవరి మాట వినని ముఖ్యమంత్రి సైతం.. తాను అనుకున్న నిర్ణయాన్ని మార్చుకునేలా చేయటంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద విగ్రహాల నిమజ్జనంపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం.. ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనానికి అనుమతులు ఇవ్వమని తేల్చి చెప్పారు.

అయితే.. దీనిపై తెలంగాణ బీజేపీతో పాటు..హిందూ సంఘాలు గళం విప్పాయి. హిందువుల పండుగల్ని టార్గెట్ చేస్తున్నారని.. ఏదో ఒక విధంగా తమ స్థైర్యాన్ని దెబ్బతీయటమే పనిగా పెట్టుకుందంటూ కేసీఆర్ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు బండి సంజయ్. నిమజ్జనం సందర్భంగా గణేశ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
దీనిపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు..

ట్యాంక్ బండ్ మీద నిమజ్జనానికి కేసీఆర్ సర్కారు అనుమతి ఇవ్వని పక్షంలో ప్రగతిభవన్ లోనే నిమజ్జన కార్యక్రమం చేపడతామన్న బండి సంజయ్ పలుమార్లు అల్టిమేటంను జారీ చేశారు. ఆయన మాటకు దన్నుగా పలు హిందుత్వ సంఘాలు తెర మీదకు వచ్చాయి.దీంతో కళ్లు తెరిచిన గులాబీ సర్కారు.. ఈ ఇష్యూను మరింత ముందుకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. నిమజ్జనానికి గణేశ్ విగ్రహాల్ని ట్యాంక్ బండ్ మీదకు వచ్చేలా వాహనాల్ని అనుమతించటంతోపాటు.. వెను వెంటనే చర్యలు చేపట్టారు.

శుక్రవారం జరిగే నిమజ్జన కార్యక్రమానికి ఒక్క హుస్సేన్ సాగర్ చుట్టూ 12 వేల మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనం కోసం వచ్చే విగ్రహాలకు సాయంగా ఉండేందుకు ట్యాంక్ బండ్ ఒక్క చోటనే 22 క్రేన్లను అందుబాటులోకి ఉంచనున్నట్లుగా పేర్కొన్నారు. ఖైరతాబాద్ వినాయకుడి మహా నిమజ్జనం కోసం క్రేన్ నెంబరు 4ను కేటాయించినట్లుగా వెల్లడించారు.

అంతేకాదు.. నిమజ్జనం వేళ సాగర్ లోకి వచ్చి చేరే వ్యర్థాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే 20జేసీబీలను తీసుకొచ్చి.. ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు..సాగర్ చుట్టూ 200 సీసీ కెమేరాలతో పాటు.. అదనంగా మరికొన్ని కెమేరాలను తెప్పించారు. మొత్తానికి ట్యాంక్ బండ్ మీదకు వినాయక నిమజ్జనానికి అనుమతిని ఇచ్చే విషయంలో.. కేసీఆర్ సర్కారు అనుకున్న నిర్నయాన్ని మార్చుకునేలా చేయటంలో బండి ప్రభావం చాలానే ఉందని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News