విశాఖ రాజధానిపై ఉప ఎన్నికకు రెడీ : అయ్యన్న

Update: 2020-10-03 18:00 GMT
మూడు రాజధానుల వ్యవహారం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య చిచ్చు పెట్టింది. వైసీపీ ప్రతిపాదించిన మూడు రాజధానులకు ఇక్కడి ప్రజలు అనుకూలమని.. దమ్ముంటే తనపై పోటీచేసి గెలవాలని డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి ధర్మానా కృష్ణదాస్ తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు.

ఈ సవాల్ పై స్పందించిన ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు హాట్ కామెంట్స్ చేశారు. ఎక్కడో ఎందుకు విశాఖ పార్లమెంట్ స్థానంలోనే ఉప ఎన్నిక పెడుదామని.. ఉప ఎన్నికలకు వైసీపీ రెడీ అంటూ ప్రతిసవాల్ విసిరారు.

రాజధాని అంశంపై విశాఖ ఎంపీ సీటులో ఉప ఎన్నిక పెట్టి తేల్చుకుందామని.. ఇందుకు మంత్రి ధర్మానా సిద్ధమా అని అయ్యన్న ప్రశ్నించారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.

రాజధానిపై గతంలో చంద్రబాబు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళుదామంటే సీఎం జగన్ పారిపోయాడని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు.ఇప్పుడైనా విశాఖ లోక్ సభ స్థానంలో ఉప ఎన్నికకు వెళ్తే ప్రజలే తేలుస్తారని అయ్యన్న పేర్కొన్నారు.

పత్రికలు రాసేందుకు కూడా సిగ్గుపడేలా మంత్రి ధర్మానా మాట్లాడాడని.. చంద్రబాబుపై అసహ్యంగా మాట్లాడారని.. వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలకు బూతులు తిట్టడమే పనా అంటూ అయ్యన్న విమర్శలు గుప్పించారు.
Tags:    

Similar News