కేసీఆర్‌ ను ఢీకొట్టేందుకు సిద్ధ‌మైన బాల‌య్య‌

Update: 2018-09-27 17:30 GMT
తెలంగాణ‌లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అనూహ్య రీతిలో వెలువ‌డిన ముంద‌స్తు ప్ర‌క‌ట‌న‌తో విప‌క్ష పార్టీలు ఇప్పుడిప్పుడే త‌మ అస్త్రశ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకుంటుంటే టీఆర్ ఎస్ పార్టీ ప్రీప్లాన్డ్‌ గా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఆ పార్టీకి ప‌రువు స‌మ‌స్య‌గా మారిన ఎపిసోడ్‌ లోకి ఏపీ ఎమ్మెల్యే - ప్ర‌ముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. అయితే, ఈ సీటును ఇటు జిల్లా మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అటు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బాల‌య్య ఎంట్రీ ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తుంద‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో బాలకృష్ణ తెలంగాణ పర్యటనకు సిద్ధ‌మ‌య్యారు. ఈ పర్యటనలో తెలంగాణలో టీడీపీ నేత సండ్ర వీరయ్య తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు ఎన్టీఆర్ విగ్రహాలను ఆయన ఆవిష్కరిస్తారు. అక్టోబర్ 1న కృష్ణాజిల్లా నందిగామ నుంచి ఖమ్మంలోని మధిరకు బాలకృష్ణ చేరుకుంటారు. అనంతరం రాయపట్నంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. అలాగే మధిర అంబేద్కర్ సర్కిల్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించి - దెందుకూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం బోనకల్ మండలం ఆళ్లపాడు - నారాయణపురంలో సైతం ఎన్టీ రామారావు విగ్రహాలను బాలకృష్ణ ఆవిష్కరిస్తారు. ఈ సంద‌ర్భంగా సండ్ర‌కు మ‌ద్ద‌తుగా ఆయ‌న ప్ర‌చారం చేయ‌నున్నారు.

కాగా, త‌న‌కు అన్నిసీట్ల కంటే స‌త్తుప‌లి సీటు ముఖ్య‌మని జిల్లాకు చెందిన ముఖ్య‌నేత - మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సీటును గెలిపించుకోక‌పోతే...తాను మంత్రివ‌ర్గంలో ఉండ‌బోన‌ని కూడా ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త‌ద్వారా స‌త్తుప‌ల్లిలో సండ్ర ఓట‌మి త‌మ‌కు ఎంత ముఖ్య‌మో చెప్పారు. తుమ్మ‌ల ఇంత బ‌లంగా చెప్ప‌డానికి కార‌ణం ఆయ‌న‌కు టీఆర్ ఎస్ పెద్ద‌ల నుంచి వ‌చ్చిన ఆదేశాలే అనే సంగ‌తి చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా బాల‌య్య ఎంట్రీతో జిల్లాలో రాజ‌కీయం ఎలా మారనుంది? ఓట‌ర్లు ఎవ‌రివైపు మొగ్గుచూపుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. 
Tags:    

Similar News