కొత్త యాంగిల్ చూపించిన బాలయ్య..

Update: 2019-10-24 09:46 GMT
అదే పనిగా బాలయ్య మీద కొందరు పడిపోతుంటారు. ఆయన్ను ఉద్దేశించి కాస్తంత ఎటకారంగా మాట్లాడుతుంటారు. కానీ.. పరిస్థితులు తనకు అనుకూలంగా లేకుండా ఎంత జాగ్రత్తగా ఉంటారన్న విషయాన్ని తెలియజేసిన వైనం ఆసక్తికరంగానే కాదు.. బాబు కంటే బాలయ్యే బెటర్ అన్నట్లుగా అనిపించక మానదు. అధికారం చేతిలో ఉన్నప్పుడు బాలయ్య చేష్టలు చాలానే వివాదమయ్యాయి. తనను తాకేందుకు పోటీ పడే అభిమానులపై ఆయన చేయి చేసుకోవటం.. నోరు పారేసుకోవటం తెలిసిందే. మరి.. అలాంటి బాలయ్యను ఆగ్రహంతో ప్రజలు అడ్డుకుంటే ఎలా రియాక్ట్ అవుతారు? అన్నది క్వశ్చనే.

తాజాగా అలాంటి పరిణామమే ఎదురైంది. హిందూపురం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి హిందూపురం వెళుతున్నారు. బాలయ్య వస్తున్నారని తెలిసి తమ సమస్యల పరిష్కారం కోసం హిందూపురం ప్రజలు లేపాక్షి మండలంలోని గలిబిపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. తమకు రోడ్డు వేసేందుకు భూమిపూజ చేసి ఏడాది కావొస్తున్నా పనులు ఇంకా ఎందుకు పూర్తి కాలేవంటూ నిలదీశారు.

బాలయ్యను అడగటమే కానీ నిలదీయకూడదన్న మాట పలువురి నోట వస్తుంటుంది. అందుకు భిన్నంగా తనను ప్రశ్నించినప్రజలకు ఓపిగ్గా బదులివ్వటం గమనార్హం. గ్రామస్థుల ఆవేదనను ఓపిగ్గా విన్న బాలయ్య.. వారి సమస్యపై స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలో రోడ్డు పనులు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్థులు శాంతించారు. అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయే బాలయ్య.. తనను అడ్డుకొని ఆగ్రహం వ్యక్తం చేసినా వారి సమస్యలపై పరిష్కరించిన తీరు ఆశ్చర్యకరంగా ఉందంటున్నారు.
Tags:    

Similar News