వైసీపీ కి బిగ్ ట్రబుల్ గా పెద్దాయన... ?

Update: 2021-11-27 00:30 GMT
శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యవహార శైలి మీద అధినాయకత్వం గుస్సా అవుతోంది అన్న ప్రచారం సాగుతోంది. సొంత ప్రభుత్వం మీదనే ఆయన విమర్శలు చేయడాన్ని సీరియస్ గానే పరిగణిస్తున్నారుట. నిజానికి జగన్ పార్టీ వీడి బయటకు వచ్చినపుడు ధర్మాన కాంగ్రెస్ లో ఉండిపోయారు. ఆయన చివరి వరకూ కాంగ్రెస్ లో ఉండి విభజన జరిగాక ఇక ఆ పార్టీకి ఫ్యూచర్ లేదని తెలిసే వైసీపీలోకి 2014 ఎన్నికల ముందు వచ్చారని అంటారు. అయితే అప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన అన్న క్రిష్ణ దాస్ వైసీపీలో చురుకుగా ఉన్నారు. ఆయన జగన్ కోసం కాంగ్రెస్ ని వీడి ఉప ఎన్నికల్లో పోటీ చేసి మరీ గెలిచారు. క్రిష్ణదాస్ సతీమణి పద్మప్రియ శ్రీకాకుళం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా అప్పట్లో బాధ్యతలు నిర్వహించి పార్టీని పటిష్టం చేశారు.

మరో వైపు ప్రసాదరావుని చేర్చుకోవడం జగన్ కి ఇష్టం లేకపోయినా క్రిష్ణ దాస్ మాట మీద చేర్చుకున్నారని చెబుతారు. 2014 ఎన్నికల్లో ధర్మానకు శ్రీకాకుళం టికెట్ ఇచ్చారు. అయితే నాడు ఆయన ఓడిపోయారు. గత అయిదేళ్లలో కూడా ప్రసాదరావు కొన్ని సందర్భాల్లో అధినాయకత్వం మాటను పెడ చెవిన పెట్టారని అంటారు. ఇక ఆయన అప్పట్లో జరిగిన పార్టీ సమావేశంలో సొంత పార్టీ మీద విమర్శలు చేసి కలకలం సృష్టించారు. 2014లో జిల్లాలో వైసీపీ ఓటమి మీద మాట్లాడుతూ జగన్ పులివెందుల వదిలి శ్రీకాకుళం వస్తే ఆయన సైతం ఓడిపోతారంటూ హాట్ కామెంట్స్ చేశారు.

అలా వైసీపీ విపక్షంలో ఉన్నపుడు కూడా ప్రసాదరావు కొన్నాళ్లు పార్టీ పెద్దల మీద బాణాలు వేస్తూనే వచ్చారు. అయితే ఆ తరువాత జగన్ ఆయన్ని చేరదీసి జిల్లా బాధ్యతలు అప్పగించారు. దాంతో ఆయన 2019 ఎన్నికల వేళ తన వంతుగా కష్టపడ్డారు. జగన్ వేవ్ కూడా తోడు అయి పార్టీ పవర్ లోకి వచ్చింది. అయితే తాను మంత్రి అవుతాను అని గట్టిగా నమ్మిన ప్రసాదరావుకు హ్యాండ్ ఇస్తూ జగన్ ఆయన అన్న క్రిష్ణ దాస్ కి మంత్రి పదవి కట్టబెట్టారు. అయితే ఇందులో ప్రసాదరావు మీద వ్యతిరేకత ఏమీ లేదని, జగన్ పెట్టుకున్న పాలసీ ప్రకారం తొలి నుంచి ఉన్న వారికి, తన కష్టాలలో తోడున్న వారికే మంత్రి పదవులు ఇచ్చారని అంటారు.

ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నది అధినాయకత్వం మాట. అయితే ధర్మాన మాత్రం గత రెండున్నరేళ్లుగా చూస్తే ఏ మాత్రం సంతోషంగా లేరు. ఆయన ఉంటే ఫుల్ సైలెంట్ మోడ్ లో ఉండడం, లేకపోతే అధినాయకత్వాన్ని ఇబ్బంది పెట్టేల అ కామెంట్స్ చేయడం జరుగుతోంది. దీంతో ఆయన తన అవకాశాలను చేజేతులా పాడుచేసుకుంటున్నారు అని పార్టీలో ఒక వర్గం అంటూంటే జగన్ తనకు పదవి ఇవ్వడని తెలిసే ప్రసాదరావు ఇలా బరస్ట్ అవుతున్నారని ఇతర నేతలు అంటున్నారు. మొత్తానికి ధర్మానను కంట్రోల్ చేయమని పార్టీ హై కమాండ్ ఆయన అన్న క్రిష్ణదాస్ కి సూచించిందని టాక్.

ప్రసాదరావు పార్టీ లైన్ దాటకుండా చూడాలని కూడా కోరారని చెబుతున్నారు. ఇక ఆయన మీడియా సమావేశాలను పెట్టినా కూడా పార్టీ ఆఫీస్ లోనే పెట్టాలని కూడా గట్టిగా చెప్పారుట. అయితే ఈ సూచనలను బేఖాతరు చేస్తూ ధర్మాన వేరే చోట సొంతంగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. పైగా సర్కార్ విధానాల మీద ఆయన మాట్లాడుతున్నారు. దీంతో ఆయన విషయంలో ఏం చేయలేకపోతున్నామని పార్టీ పెద్దలు గుస్సా అవుతున్నారుట. మంత్రి వర్గ విస్తరణ అంటూ జరిగితే ఈసారి ప్రసాదరావుకు పదవి రాదు అని ఒక వర్గం ఇప్పటికే గట్టిగా చెబుతూంటే ధర్మాన లేవనెత్తే ప్రశ్నలలో తప్పేంది, జగన్ ప్రసాదరావు లాంటి సీనియర్ ని అసలు వదులుకోరు. ఆయన మంత్రి అవడం గ్యారంటీ అని అనుచరులు అంటున్నారుట. మొత్తానికి శ్రీకాకుళం పెద్దాయనగా ఉన్న ఈ మాజీ మంత్రి వైసీపీకి బిగ్ ట్రబుల్ గా మారిపోతున్నారా అన్నది అయితే చర్చగా ఉంది.
Tags:    

Similar News