ఏపీ పాలిటిక్స్ లోకి మహిళా ముఖ్యమంత్రి... ?

Update: 2023-01-19 06:30 GMT
ఏపీ రాజకీయాలు ముఖ్యమంత్రి పదవి చుట్టూనే తిరుగుతున్నాయి. అందరూ సీఎం అనే అంటున్నారు. సినిమా నటుల నుంచి ఆ మాత్రం క్రేజ్ ఉన్న పొలిటీషియన్లు దాకా అందరూ కాబోయే సీఎం అని తగిలించేసుకుంటున్నారు. ఇక ఏపీలో జనసేనతో కలసి వెళ్తే తమకు రాజకీయంగా కలసి వస్తుందని థర్డ్ ఫోర్స్ గా నిలబడవచ్చు అని బీజేపీ నిన్నటి దాకా లెక్కలేసుకుంది.

కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునే విధంగా సంకేతాలు పంపిస్తున్నారు. దాంతో బీజేపీ కేంద్ర పెద్దలు సైతం ఆలోచనలలో పడిపోతున్నారు. తమ అజెండా తాము బయటకు తీస్తున్నారు. ఏపీలో ఎంతసేపూ జగన్ చంద్రబాబు, పవన్ మాత్రమే ముఖ్యమంత్రి అభ్యర్ధులా అంటూ బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్ధిని బయటకు తీస్తోంది. ఆమె ఎవరో కాదు నందమూరి వారసురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.

ఆమెను ముందు పెట్టి ఏపీలో రాజకీయ పందెం కాయాలని బీజేపీ భావిస్తోంది. దగ్గుబాటి పురంధేశ్వరి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. చైతన్యవంతమైన మహిళా నాయకురాలిగా ఉంటున్నారు. దాంతో ఇంతకాలం ఆమె సేవలను జాతీయ రాజకీయాల్లో ఉపయోగించుకోవాలని చూసిన బీజేపీ ఇపుడు ఆమెను ఫస్ట్ టైం ఏపీ అసెంబ్లీ బరిలో దింపాలనుకుంటోందిట.

అంటే ఆమె ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారు అని అంటున్నారు. ఒంగోలు అసెంబ్లీ సీటు నుంచి పురంధేశ్వరిని పోటీ చేయించడం ద్వారా బీజేపీ ఏపీలో ప్రజలకు గట్టి సంకేతాలను పంపాలను చూస్తోంది అని అంటున్నారు. సామాజికవర్గం పరంగానే కాకుండా ఎన్టీయార్  తనయగా, రాజకీయాల్లో రెండు దశాబ్దాల పాటు అనుభవం కలిగిన నేతగా పురంధేశ్వరి ఉన్నారు.

దాంతో ఆమె అసెంబ్లీకి పోటీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని బీజేపీ పెద్దలు ఊహిస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ రోడ్ మ్యాప్ లో భాగంగానే ఇదంతా అని అంటున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచే పోటీ తెస్తే తమకు తెలుగుదేశం ఓట్ల నుంచి ఎంతో కొంత ఇటు వైపు నకు మళ్ళి రాజకీయ లాభం కలుగుతుందని బీజేపీ ఊహిస్తోంది.

నిజానికి బీజేపీ జనసేన కూటమి అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్ పేరుని ప్రకటించాలని అనుకున్నారు. కానీ పవన్ బీజేపీతో కలసి ఉంటారా లేదా అంటే డౌట్లు కమలం పార్టీ నుంచే వస్తున్నాయి. దాంతో తమ సొంత అజెండాను అమలు చేయాల్సిన సమయం వచ్చినని భావించే బిగ్ షాట్స్ ని ఎంపీ కోసం కాదు ఎమ్మెల్యే ఎన్నికలకే అంటూ కొత్త నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు.

రానున్న రోజుల్లో పురంధేశ్వరిని ఏపీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి ముందుకు సాగుతారని అంటున్నారు. అలాగే ఏపీలో బలమైన నియోజకవర్గాలను ముందే ఎంపిక చేసుకుని అభ్యర్థులను ముందుగానే ప్రకటిచడాం ద్వారా ముందస్తు ఎన్నికలు వచ్చినా తట్టుకునేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News