ప‌ట్ట‌ప‌గ‌లే దారుణం..ఎమ్మెల్యే కూతురిపై దాడి

Update: 2017-04-05 09:21 GMT
నిజ‌మే... దేశంలో ఆక‌తాయిల వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయి. పెరిగిపోతున్నాయ‌నేకంటే కూడా వెర్రి త‌ల‌లు వేస్తున్నాయ‌ని చెబితే బాగుంటుందేమో. ఎందుకంటే... అధికార పార్టీకి చెందిన ఓ ప్ర‌జా ప్ర‌తినిధి కూతురుపైనే వేధింపుల‌కు పాల్ప‌డ్డ ఓ ఆక‌తాయి.. త‌న‌పై ఫిర్యాదు చేసింద‌న్న కార‌ణంతో ఆమెపై క‌త్తితో దాడి చేయ‌డ‌మే కాకుండా... చేతి వేలిని క‌ట్ చేసేశాడు. ప్ర‌స్తుతం బాధితురాలు ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటుండ‌గా.. దాడికి తెగ‌బ‌డ్డ ఆక‌తాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప‌ట్ట‌ప‌గ‌లు జ‌న‌మంతా చూస్తుండ‌గానే జ‌రిగిన ఈ ఘ‌ట‌న దేశంలో మ‌హిళ‌ల‌కు ఏమాత్రం భ‌ద్ర‌త లేద‌న‌డానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇక ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే... మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి బొడ్‌కుర్వార్ కూతురు అశ్విని రెడ్డి న‌గరంలోని ఓ క‌ళాశాల‌లో చ‌దువుతోంది. అదే క‌ళాశాల‌కు చెందిన విద్యార్థి రాజేశ్ ప్ర‌వీణ్ కుమార్ భ‌క్తి ... అశ్వినితో గ‌డ‌చిన 8 నెల‌లుగా ప‌రిచయం పెంచుకున్నాడు. కాలం గ‌డిచే కొద్దీ ఆమెపై అత‌డు పెత్త‌నం చెలాయించ‌డం మొద‌లెట్టాడు. ఈ క్రమంలోనే అశ్వినిరెడ్డికి అత‌డి నుంచి వేధింపులు మొద‌ల‌య్యాయి. దీంతో విసిగివేసారిన అశ్విని... అత‌డిపై క‌ళాశాల యాజ‌మాన్యానికి ఫిర్యాదు చేసింది. యాజ‌మాన్యం మంద‌లింపుతో ఇక‌పై అశ్విని జోలికి వెళ్ల‌బోన‌ని చెప్పి బ‌య‌ట‌ప‌డ్డ రాజేశ్... కళాశాల ఆవ‌ర‌ణ‌లోనే అశ్వినిపై క‌త్తితో దాడి చేశాడు.

ప‌ట్ట‌ప‌గ‌లు తోటి విద్యార్థులంతా చూస్తుండ‌గానే జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో రాజేశ్... అశ్విని శ‌రీరంపై ప‌లు చోట్ల క‌త్తితో పొడిచాడు. ఈ క్ర‌మంలో అత‌డి క‌త్తి గాట్ల‌కు అశ్విని చేతి వేలు కూడా తెగి కింద ప‌డిపోయింది. ఈ ఘ‌ట‌న‌తో షాక్ కు గురైన విద్యార్థులు తేరుకుని అశ్వినిని ర‌క్షించేందుకు రంగంలోకి దిగ‌గా... రాజేశ్ ప‌రార‌య్యాడు. వెనువెంట‌నే అశ్వినిని క‌ళాశాల యాజ‌మాన్యం ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా, శ‌రీరం నుంచి విడిపోయిన వేలిని ఆప‌రేష‌న్ చేసి వైద్యులు అతికించేశారు. ఈ స‌మాచారం తెలుసుకున్న సంజీవ్ రెడ్డి కుటుంబం హుటాహుటీన అక్క‌డ‌కు చేరుకుంది. సంజీవ్ రెడ్డి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రాజేశ్‌ను అరెస్ట్ చేశారు.

ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన సంజీవ్ రెడ్డి... విష‌యాన్ని నేరుగా సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ దృష్టికి తీసుకెళ్లామ‌ని, నిందితుడిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని ఫ‌డ్న‌వీస్ హామీ ఇచ్చార‌ని చెప్పారు. ఏదేమైనా అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కూతురు అన్న విష‌యం తెలిసి కూడా రాజేశ్‌... ప‌ట్ట‌ప‌గ‌లు, అంద‌రూ చూస్తుండ‌గానే ఇలా బ‌రి తెగించిన వైనం ముంబై వాసుల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేసింద‌నే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News