ఆ రాష్ట్రంలో అప్పుడే క్యాంప్‌ రాజకీయాలు షురూ!

Update: 2022-12-08 06:26 GMT
రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ ఫలితాలు అంతుచిక్కడం లేదు. క్షణక్షణానికి ఇక్కడ పార్టీల ఆధిక్యం మారుతూ వస్తోంది. ఓవైపు ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోసం హోరాహోరీ తలపడుతున్నాయి. రెండు పార్టీల మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది. మరోవైపు అనేక ఉచిత హామీలిచ్చి అధికారంలోకి రావాలనుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను హిమాచల్‌ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. మొత్తం 68 సీట్లలో ఒక్కటంటే ఒక్క చోట కూడా కేజ్రీవాల్‌ పార్టీ ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం.

ఎన్నికలు ముగిశాక ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాల్లో హిమాచల్‌ ప్రదేశ్‌లో అధికారం కాంగ్రెస్‌కు వస్తుందని కొన్ని సంస్థలు, లేదు బీజేపీకి వస్తుందని కొన్ని సంస్థలు తమ ఎగ్జిట్‌పోల్స్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. హంగ్‌ అసెంబ్లీకి కూడా ఆస్కారం ఉందని మరికొన్ని ప్రకటించాయి. ఎవరికి మెజారిటీ వచ్చినా బొటాబొటీ మెజారిటీయేనని తెలిపాయి. ఎగ్జిట్‌పోల్‌ సంస్థలు ఊహించినట్టే హిమాచల్‌ప్రదేశ్‌లో ఫలితాలు కనిపిస్తున్నాయి.

ఈ వార్త రాసే సమయానికి మధ్యాహ్నం 12 గంటలకు హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం 68 స్థానాల్లో కాంగ్రెస్‌ 36 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకైనా కావాల్సిన సీట్లు 35. ఇతరులు ఇప్పటికే ఒక సీటును గెలుచుకోగా మరో రెండు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై స్పష్టత వీడటం లేదు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ముందు జాగ్రత్త చర్యగా తన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను రిసార్ట్స్‌కు తరలిస్తోంది. బీజేపీ 'ఆపరేషన్‌ కమలం' చేపట్టే అవకాశం ఉండటంతో రిసార్ట్స్‌కు తరలించే ప్రయత్నాల్లో కాంగ్రెస్‌ ఉంది.

ఈ ఫలితాల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను గురువారం సాయంత్రానికి బస్సుల్లో రాజస్థాన్‌ తరలించేందుకు హస్తం పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాజస్థాన్‌లో ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల తరలింపు బాధ్యతను ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్, పార్టీ సీనియర్‌ నేత భూపిందర్‌ సింగ్‌ హుడాకు అప్పగించినట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా హిమాచల్‌ పరిస్థితులను ఐఏసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె హుటాహుటిన హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News