మందుతోపాటు చంద్రబాబు.. ఇవి రెండే గుర్తుకురావాలి

Update: 2022-12-31 06:43 GMT
ఆంధ్రప్రదేశ్ లో మద్యంపై రాజకీయం వేడేక్కుతోంది. మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చిన వైసీపీ ఐదేళ్లు పూర్తవుతున్నా.. పట్టించుకోలేదు. దీంతో మహిళలు ఆ పార్టీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యాన్ని నిషేధిస్తాం.. అని చెప్పాల్సిన ప్రతిపక్ష పార్టీ నేతలు.. తక్కువ ధరకే మద్యం అందిస్తామని అంటున్నారు.  ఇప్పుడున్న  ప్రభుత్వం నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్నారట..! తాము అధికారంలోకి వస్తే  తక్కువ ధరకే నాణ్యమైన మందు ఇస్తాం..! అంటే కామెంట్స్ చేస్తున్నారు. మద్యమే వద్దు బాబోయ్.. అని మహిళలు పోరాడుతుంటే.. ఇప్పుడు కల్తీ మద్యం, నాణ్యమైన మద్యం అంటూ రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మందుతాగే ప్రతీ వ్యక్తికి తానే గుర్తుకు రావాలి.. అని అన్నారు.  తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తక్కువ ధరకే మద్యం అందిస్తామని మందుబాబులకు హామీ ఇస్తున్నారు.. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏపీలో మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే అప్రమత్తమవుతున్నాయి. ఇందులో భాగంగా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ప్రజల్లో తిరుగుతున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కావలిలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మద్య నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ ఆ హామీని మరిచిపోయాడని అన్నారు.

అలాగే మద్యం దుకాణాలకు కొన్ని లోకల్ బ్రాండ్లకు చెందిన నకిలీ మద్యాన్ని వైన్ షాపులకు సరఫరా చేస్తున్నారని విమర్శించారు. ఇది తాగి చాలా మంది అనారోగ్యంతో మరణించారన్నారు. నాణ్యమైన మద్యం అమ్మడం ద్వారా జగన్ కు లాభం జరగదని, అందుకే తక్కువ ధరకు మద్యాన్ని తయారు చేయించి.. అధిక ధరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఇక ప్రభుత్వం మద్యం దుకాణాలను తనఖా పెట్టి 9 కోట్ల రుణాన్ని తెచ్చుకున్నట్లు తెలిపారు.అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం అందిస్తామన్నారు. తక్కువ ధరకే నాణ్యమైన బ్రాండ్లను అందిస్తామని హామి ఇచ్చారు.

చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ సాగుతోంది. మద్యపానం నిషేధించాలని ఎన్నో ఏళ్లుగా మహిళలు ఉద్యమాలు చేస్తున్నారు.  గత టీడీపీ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతోనే వైసీపీ అధికారంలోకి రావాలని మహిళలు కాంక్షించారు. అందులో భాగంగా వైసీపీ వస్తే తమ బాధలు తీరుతాయని అనుకున్నారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చే ఐదేళ్లు గడుస్తున్నా.. ఆ హామీని పట్టించుకోవడం లేదు. విడతల వారీగా మద్యం రేట్లు పెంచుతామని, అలా చేయడం వల్ల మందుబాబులు మద్యానికి దూరమవుతారని అన్నారు. కానీ అది సాధ్యం కాలేదు.

ఇప్పుడు చంద్రబాబు మహిళల పడుతున్న బాధలను తీర్చాల్సింది పోయి మందుబాబులకు వత్తాసు పలకడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మద్యపానంతో చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొందరు అనారోగ్యంతో మంచానికే పరిమితం అయ్యారు. ఈ సమయంలో వారికి అండగా ఉండాల్సింది పోయి తక్కువ ధరకే మద్యం విక్రయిస్తామని చంద్రబాబు అనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంటే తక్కువ రేటుకు మద్యం విక్రయిస్తామని.. మరింత మంది మందు తాగండని బాబు చెబుతున్నాడని కొందరు సెటైర్లు వేస్తున్నారు. అంతేకాకుండా మందు తాగేటప్పుడు ప్రతి ఒక్కరికి బాబే గుర్తుకు రావాలి.. అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News