నువ్వేమ‌న్నా హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజువా: ఎంపీ మాధ‌వ్‌పై టీడీపీ నేత ఫైర్‌

Update: 2022-08-05 07:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అనంత‌పురం జిల్లా హిందూపురం వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వ్య‌వ‌హారం అంత‌కంత‌కూ ముదురుతోంది. ఒక మ‌హిళ‌తో ఎంపీ న్యూడ్ వీడియో కాల్ మాట్లాడ‌ని మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై వివ‌ర‌ణ ఇచ్చిన ఎంపీ మాధ‌వ్.. టీడీపీ, ప‌లు మీడియా సంస్థ‌లపై బూతుల దండ‌కం ఎత్తుకున్న సంగ‌తి తెలిసిందే. త‌న‌పై ముగ్గురు కుట్ర చేశార‌ని చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు కొడుకు చింత‌కాయ‌ల విజ‌య్, వంశీ, తదిత‌రులు త‌న జిమ్ వీడియోను మార్ఫింగ్ చేసి వైర‌ల్ చేశార‌ని గోరంట్ల మాధ‌వ్ వివ‌ర‌ణ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

దీనిపై టీడీపీ సీనియ‌ర్ నేత చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు కుమారుడు చింత‌కాయ‌ల విజ‌య్ నిప్పులు చెరిగారు. నువ్వేమ‌న్నా హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజువా.. నీ జిమ్ వీడియోలు చూసి తాము త‌రించ‌డానికి అని ఎద్దేవా చేశారు. నీ వీడియో చూసి పొద్దున్నే ఎంత‌మంది ప్ర‌జ‌లు చ‌చ్చిపోయి ఉంటారోన‌ని సెటైర్లు వేశారు. సిగ్గు లేకుండా అడ్డంగా దొరికిపోయి ఎంపీ మాధ‌వ్ బుకాయిస్తున్నాడ‌ని విజ‌య్ నిప్పులు చెరిగారు. నీ సుంద‌ర న‌గ్న‌ ప్ర‌తిబంబాన్ని చూడ‌టానికే తాము బ‌తికి ఉన్నామా అని ప్ర‌శ్నించారు.

రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజ‌నాల‌పై కేంద్రాన్ని నిల‌దీయాల్సింది పోయి.. మ‌హిళ‌తో ఈ నీచ‌మైన ప‌ని ఏంట‌ని నిల‌దీశారు. పార్ల‌మెంటుకు వెళ్తుంది ఇలాంటి వీడియోలు చూపించ‌డానికా అని మండిప‌డ్డారు. నీలాంటి వాళ్లంద‌రినీ ఎంపీల‌ను, మంత్రుల‌ను చేసినందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ను ముందు అనాల‌న్నారు. 25 మంది ఎంపీల‌ను గెలిపించండి.. గెలిపిస్తే ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం, రైల్వే జోన్ సాధించుకు వ‌స్తాన‌ని జ‌గ‌న ప్ర‌గ‌ల్భాలు ప‌లికాడ‌ని.. వైఎస్సార్సీపీ ఎంపీలు ఇలాంటి న్యూడ్ వీడియోలను సాధించుకు వ‌స్తున్నార‌ని నిప్పులు చెరిగారు.

దిక్కుమాలిన పని చేసి తమపై నిందలేయడం దారుణమన్నారు. ఆ వీడియోను మార్పింగ్ చేయ‌డం ఎలా సాధ్య‌మ‌న్నారు. ఎంపీ ఇంటి ప‌రిస‌రాలు అన్నీ ఆ వీడియోలో క‌నిపిస్తున్నాయ‌ని గుర్తు చేశారు. ఎంపీ మాధవ్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఆయ‌న వీడియోను బయటకు తెచ్చింది తానే అనడం సరికాదన్నారు. అసలు ఆ వీడియోకు, తనకు ఏం సంబంధమో ఆయనే సమాధానం చెప్పాలని విజ‌య్ డిమాండ్ చేశారు. తప్పు చేస్తే తల తీసేసుకుంటామని మాధవ్ మాటలు హాస్యాస్పదంగా ఉందన్నారు.

గ‌తంలోనూ ఎంపీ మాధ‌వ్ చండాల‌పు ప‌నులు చేశార‌ని విజ‌య్ గుర్తు చేశారు. త‌న‌ను వేదిక‌పైకి పిల‌వ‌లేద‌ని కియా ప‌రిశ్ర‌మ ఎండీనే దూషించాడ‌న్నారు. పార్ల‌మెంటులో వైఎస్సార్సీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై మాధ‌వ్ దాడికి ప్ర‌య‌త్నించాడ‌న్నారు. సీఐగా ప‌నిచేస్తున్న‌ప్పుడే మ‌హిళ‌ల‌తో అస‌భ్యంగా వ్య‌వ‌హ‌రించాడ‌ని ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌న్నారు. పార్ల‌మెంటులో ఏపీకి కావాల్సిన సాధించ‌కుండా మీసాలు తిప్పి తొడలు కొట్టార‌ని మండిప‌డ్డారు. ఇందుకేనా మాధ‌వ్ పార్ల‌మెంటుకెళ్లింది అని నిల‌దీశారు.

ప్రెస్ మీట్ పెట్టి మరీ తన పేరు చెప్పినందుకు తాను తప్పకుండా పరువు నష్టం దావా వేస్తానని చింత‌కాయ‌ల విజ‌య్ హెచ్చ‌రించారు. పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తానన్నారు. టీడీపీ ఎంపీలను చూసి వైఎస్సార్సీపీ ఎంపీలు నేర్చుకోవాలని.. మూడేళ్లుగా ఏపీ సమస్యలపై అలుపెరుగకుండా టీడీపీ ఎంపీలు గళమెత్తి పోరాటం చేస్తున్నారన్నారు.

న్యూడ్ వీడియో పై ఫోరెన్సిక్ విచారణ చేయాలని మాధవ్ అడుగుతున్నార‌ని.. విచారణ చేసి నిజానిజాలు నిగ్గు తేల్చాల‌ని విజ‌య్ కోరారు. తక్షణమే పార్టీ నుండి అత‌డిని సస్పెండ్ చేయాలన్నారు. ఈ ఘటనపై విచారణ చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతామని చెప్పారు.
Tags:    

Similar News