ఆ రాష్ట్రం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్టార్‌ క్రికెటర్‌ భార్య!

Update: 2022-11-09 08:30 GMT
ప్రస్తుతం దేశంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలకు డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. హోరాహోరీగా పార్టీలు ప్రచారం చేస్తున్నాయి.

ప్రస్తుతం గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ల్లో బీజేపీ అధికారంలో ఉంది. మరోమారు ఈ రెండు రాష్ట్రాలను దక్కించుకోవాలనే కృతనిశ్చయంతో ఆ పార్టీ ఉంది. అందులోనూ గుజరాత్‌.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సొంత రాష్ట్రం కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో గెలవడం బీజేపీ అధిష్టానానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ క్రమంలో బీజేపీ వివిధ రంగాల నుంచి ప్రముఖులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా సినిమా, క్రీడా రంగాలపై బీజేపీ దృష్టి సారించింది.

ఈ క్రమంలో భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తన భార్యతో కలసి తాజాగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో బీజేపీ నుంచి రవీంద్ర జడేజా భార్య రీవాబా జడేజా పేరు వినిపిస్తోంది. మొదటి విడత అభ్యర్థుల జాబితాలోనే ఆమె పేరు ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా రీవాబా జడేజా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివింది. ఆమె 2016లో రవీంద్ర జడేజాను వివాహం చేసుకుంది. రీవాబా... రాజ్‌పుత్‌ వర్గానికి చెందిన కర్ణిసేన నాయకురాలు కావడం గమనార్హం. ఈమె మూడేళ్ల క్రితం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రముఖ రాజకీయనేత హరి సింగ్‌ సోలంకికి రీవాబా దగ్గరి బంధువు కావడం గమనార్హం.

కాగా గత 23 ఏళ్లుగా బీజేపీనే గుజరాత్‌లో అధికారంలో ఉంది. ఈసారి కూడా అధికారాన్ని చేజిక్కుంచుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ క్రమంలో కొందరు సీనియర్లు, సిట్టింగ్‌ అభ్యర్థులు, 75 ఏళ్లు దాటినవారిని పక్కనబెట్టనుందని సమాచారం. వీరి స్థానంలో వివిధ రంగాల ప్రముఖులను సీట్లు ఇవ్వాలని యోచిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో స్టార్‌ క్రికెటర్‌ రవీంద్ర జడేజా సతీమణి రీవాబా జడేజాకు సీటు ఇవ్వనుందని తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News