అమిత్ షాకు షాకిస్తున్న పెద్ద నోటు

Update: 2016-11-22 06:32 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని ప్ర‌భావితం చేయ‌గ‌ల అతికొద్ది మంది వ్య‌క్తుల జాబితా తీస్తే అందులో ప్ర‌థ‌మంగా ఉండే పేరు..భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాదే. అంత‌టి శ‌క్తియుక్తుల‌తో మోడీ నిర్ణ‌యాన్ని నిర్దేశించ‌గ‌ల అమిత్ షాకు ప్ర‌స్తుతం మోడీ ప్ర‌క‌ట‌నతోనే చిక్కులు ఎదురవుతున్నట్లుగా క‌నిపిస్తున్నాయి. స‌హ‌జంగానే అది ప్ర‌స్తుతం  రచ్చ‌రచ్చ‌గా మారుతున్న‌ పెద్ద నోట్ల ర‌ద్దుతోనే. అయితే అమిత్ షాకు ఇస్తున్న ఉదంతం మ‌న రాష్ట్రంలో కావ‌డం విశేషం!

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26న భారీ రైతు సభ నిర్వహిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సభకు సుమారు లక్ష మంది వస్తారని అంచనా. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ముఖ్య అతిథిగా సభలో పాల్గొని రైతులకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించనున్నారు. బీజేపీకి చెందిన‌ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సొంత నియోజకవర్గం కావడంతో ఏర్పాట్లు భారీగానే చేపట్టారు. ఈ మొత్తం కార్యక్రమానికి సుమారు రూ.2కోట్లు ఖర్చవుతుందని అనధికారిక అంచనా. ఒక వేదిక నిర్మాణానికే సుమారు రూ.30 లక్షలు ఖర్చవుతుందని అంచనా. అయితే వీట‌న్నింటిపై పెద్ద నోట్ల ర‌ద్దు ఎఫెక్ట్ ప‌డింది. సభ ఏర్పాట్లకు కరెన్సీ దొరకక స్థానిక నేతలు లబోదిబోమంటున్నారు!

ఏ రాజ‌కీయ పార్టీకి అయిన ముఖ్య నేత‌లు, అమిత్ షా వంటి జాతీయ అగ్ర‌నేత‌లు పాల్గొనే కార్య‌క్ర‌మం ఉంటే... సాధారణంగా పార్టీ ప్రజాప్రతినిధులు - పెద్ద నేతలు కొంత కొంత చందాలు వేసుకుంటూ ఆ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేస్తుంటారు. అయితే తాజాగా పెద్ద నోట్ల రద్దు వ్యవహారంతో దాదాపు అందరివద్దా కరెన్సీ కరువయ్యింది. సభకు వేదిక నిర్మాణం నుంచి షామియానా - బ్యారికేడ్లు - ఇతర ఏర్పాట్లకు పాత కరెన్సీని ఆంగీకరించడంలేదు. దీనితో ఏర్పాట్లకు అవసరమైన చిల్లర నోట్ల కోసం మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో మ‌రో మూడు రోజులే స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ స‌భా ఏర్పాట్లు వేగంగా ముందుకు సాగ‌డం లేదు. దీంతో ఇటు పెద్ద నోట్ల క‌ష్టాల గురించి త‌మ జాతీయ నాయ‌క‌త్వానికి చెప్పుకోలేక...అటు ప‌నులు ముందుకు సాగేందుకు స‌రిప‌డా నిధులు లేక క‌మ‌ళ‌నాథులు తెగ ఇబ్బందిప‌డిపోతున్నార‌ని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News