పాక్ లో దిగజారిన పరిస్థితులు.. గోధుమ పిండి కోసం తొక్కిసలాట..!

Update: 2023-01-10 15:30 GMT
పాకిస్తాన్లో పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతుంది. రాజకీయ అస్థిరత.. కరోనా ఎఫెక్ట్.. పెరిగిన ద్రవ్యోల్బణం.. ఆర్థిక మాంద్యం.. ఉగ్రవాదం.. వరదలు ఇవన్నీ కూడా పాక్ ను గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నాయి. పాకిస్తాన్లో పరిస్థితులు చూస్తుంటో శ్రీలంక బాటలోనే పాక్ సైతం దివాళా దిశగా పయనిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పాకిస్తాన్లో ద్రవ్యోల్భణం ఊహించని స్థాయిలో పెరిగిపోవడంతో ప్రభుత్వం పొదుపు చర్యలు చేపడుతోంది. ఇంధన పొదుపు కార్యక్రమంలో భాగంగా విద్యుత్ ను పొదుపు చేసే చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే మార్కెట్లు రాత్రి 8:30 గంటల తర్వాత మూసివేయాలని.. ఫంక్షన్ హాళ్లలో 10 గంటలకు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో ఫ్యాన్లు.. ఏసీలు వాడకుండా పొదుపు చర్యలు తీసుకుంటుంది.

నాసికం బల్పులు.. ఫ్యాన్ల తయారీ పై నిషేధం విధించేలా చర్యలు తీసుకుంటోంది. ఒకవైపు ధరల పెరుగుదలతో ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సబ్సిడీపై కూడా కోత పడుతోంది. మరోవైపు ఉద్యోగుల జీతాల్లోనూ కోత విధిస్తోంది. దీంతో ప్రభుత్వం సబ్సిడీపై అందించే నిత్యావసరాల కోసం ప్రజలు పోటీ పడాల్సిన పరిస్థితులు దాపురించాయి.

ఈ క్రమంలోనే ప్రభుత్వం అందించే గోధుమ పిండి కోసం ప్రజలు వేలాదిగా క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. గంటల తరబడి పిండి కోసం వేచి ఉండాల్సిన దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఖైబర్ షఖ్తూన్ ఖ్వా.. సింధ్.. బలూచిస్తాన్ వంటి ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. రేషన్ షాపుల ఎదుట ప్రతిరోజు తోపులాటలు సాధారణంగా మారిపోయినట్లు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

దీంతో భద్రతా బలగాల పహారాలో గోధుమ పిండి పంపిణీ వాహనాలు వస్తున్నాయి. వీటి చుట్టూ జరిగే తోపులాటలతో ఆయా ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్నిసార్లు పరిస్థితి ఉద్రిక్తంగా మారి ప్రాణపాయం స్థితిలోకి జారుకుంటున్నాయి. ఇటీవల ప్రావిన్స్ లోని ఒక రేషన్ దుకాణంలో తొక్కిసలాట జరిగి ఓ వ్యక్తి మృతి చెందాడు.

తన ఆరుగురి సంతానం  ఆకలి తీర్చేందుకు వెళ్లి ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. ఈ సంక్షోభం సమయంలో గోధుమలు.. పిండి ధరలు ఆకాశాన్నంటాయి. కిలో పిండి రూ.150కి పైనే చెల్లించాల్సి వస్తోంది. అదే అదునుగా కొందరు మిల్లు యజమానులు ధరలు పెంచుతున్నారు.కొన్ని చోట్ల 20 కిలోల పిండి ధర ఏకంగా 3 వేలకు చేరుకుంది.

పాక్ చరిత్రలో ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే మొదటిసారిగా తెలుస్తోంది. బెలుచిస్థాన్లో గోధుమలు నిండుకున్నాయని తక్షణమే 4లక్షల బస్తాలు కావాలని అక్కడి మంత్రి వెల్లడించడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. గతేడాది వరద కారణంగానే పాక్ లో ఆహార సంక్షోభానికి దారి తీసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకున్న తప్పుడు నిర్ణయాలే ప్రస్తుత పరిస్థితి కారణమని ఆరోపిస్తుండటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News