మాజీ సీఎం మాటః ప్యాకేజీ ఉత్త‌దేన‌ట

Update: 2016-09-20 07:02 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్యాకేజీ వ‌ట్టిపోయిన ఆవు వంటిదేన‌నే భావ‌న‌కు ఆజ్యం పోసేలాగానే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. హోదా నుంచి వెన‌క్కు త‌గ్గిన కేంద్రం ప్యాకేజీ పేరుతో నిధులు ఇస్తున్న‌ప్ప‌టికీ ప‌లు ర‌కాల నిధుల‌ను ఇందులో క‌లిపేస్తుండ‌టంతో తెలుగు వారిలో ఈ అనుమానాలు ప్రారంభం అయ్యాయి. అయితే జాతీయ స్థాయిలో రాజ‌కీయాల‌ను నిశితంగా గ‌మనిస్తున్న వారు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్త‌ప‌రుస్తుండ‌టం ఆస‌క్తిక‌రం. రాజ‌కీయ కోణం ప‌క్క‌న పెడితే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి - తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జీ దిగ్విజయ్‌ సింగ్ చేసిన వ్యాఖ్య‌లు ఇందుకు బ‌లం చేకూరుస్తుండ‌టం ఆస‌క్తిక‌రం.

తాజాగా దిగ్విజ‌య్ సింగ్ ఓ మీడియా చాన‌ల్‌ తో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి, నీతి అయోగ్‌ ఏర్పాటు చేయ‌డం ద్వారా రాష్ట్రాల హక్కులను కాలరాసిందని ఆరోపించారు. ఈ ఏర్పాటులోనే రాష్ట్రాలు కేంద్రంపై ఆధారపడేటట్టు కుట్ర చేసిందని ఆరోపించారు. ప్యాకేజీల పేరుతో రాష్ట్రాలకు హామీలు ఇస్తున్న ప్ర‌ధాన‌మంత్రి నరేంద్రమోడీ రాష్ట్రాలకు ఒక్క పైసా కూడా విదల్చడం లేదని సింగ్‌ దుయ్యబట్టారు. బీహర్‌ కు ప్యాకేజీ - ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ - కేరళకు రూ.50వేల కోట్లు అని హామీలు ఇవ్వడమే మోడీ నైజం అని మండిపడ్డారు. ఎన్నిక‌ల ముందు బీహార్ కు ఇచ్చిన ప్యాకేజీ నిధుల హామీని ఇప్ప‌టికీ కేంద్రం నెర‌వేర్చుకోవ‌డం లేద‌ని త‌ప్పుప‌ట్టారు. ఆంధ్ర‌ప్రదేశ్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోంద‌ని... ప‌లు పాత లెక్క‌ల‌ను జోడించ‌డ‌మే తార్కాణ‌మ‌ని చెప్పారు.

నిధుల కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ చుట్టు తిరుగుతున్నా కేంద్ర ప్ర‌భుత్వం పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని దిగ్విజ‌య్ సింగ్ వ్యాఖ్యానించారు. ఏపీకి ఎంతైనా చేస్తామ‌నే ప్ర‌ధాన‌మంత్రి మోడీ చెప్పింది ఒక‌టి చేస్తున్న‌ది మరొక‌టి అనే తీరుగా వ్య‌వ‌హ‌రించ‌డం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని మండిప‌డ్డారు.
Tags:    

Similar News