పరమాన్నం బాబా చంపేద్దామనుకున్నాడు

Update: 2016-06-19 04:36 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరమాన్నం బాబా ఉదంతంలో మరో షాకింగ్ అంశం బయటకు వచ్చింది. డబ్బుల్ని డబుల్ చేస్తానని మాయమాటలు చెప్పి.. మోసం చేసే ఇతగాడు.. తాజా ఎపిసోడ్ లో మాత్రం లైఫ్ స్టైల్ భవన యజమాని మధుసూదన్ రెడ్డిని హతమార్చేందుకు ప్లాన్ చేయటం గమనార్హం. భారీగా డబ్బును కళ్ల జూచిన పరమాన్నం బాబా.. అవసరమైతే మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని హతమర్చేందుకు ప్లాన్ చేసిన విషయాన్ని పోలీసుల విచారణలో వెల్లడించటంతో విచారణ అధికారులు సైతం ఉలిక్కిపడే పరిస్థితి.

పూజలో కూర్చున్న మొదటిసారి మధుసూదన్ రెడ్డి కేవలం రూ.1.5లక్షలు మాత్రమే పెట్టారని.. దాంతో.. తన దగ్గరున్న డబ్బుతో డబుల్ చేసి వారికి నమ్మకం కలిగించినట్లుగా దొంగబాబా చెప్పాడు. దీంతో.. వారు మరోసారి భారీగా డబ్బు పెట్టారని.. తాను రూ.20.. 30 లక్షలుమాత్రమే పూజలో పెడతారని భావిస్తే.. ఏకంగా రూ.1.33కోట్లు పెట్టటం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పాడు. ఆశ కూడా పెరిగిందన్నాడు.

ఎలాగైనా ఆ మొత్తాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నానని.. అవసరమైతే వారిని చంపేయాలని తాను భావించినట్లుగా చెప్పాడు. నిద్రమాత్రలు.. ఉమ్మెత్తుపూల గింజలు.. సీసంతో పరమాన్నం తయారు చేసి వారికి ఇచ్చానని ఒప్పుకున్నాడు. వచ్చీ రాని మంత్రాలతో మూడు గంటలు కాలక్షేపం చేశానని.. ఆ తర్వాత డబ్బు పెట్టాలంటూ చెప్పిన మీద భారీ మొత్తాన్ని సంచితో తీసుకొచ్చి పూజలో పెట్టినట్లుగా చెప్పాడు.

పక్కా ప్లాన్ చేసిన పరమాన్నం బాబా అంత తేలిగ్గా దొరికిపోవటానికి కారణం అతగాడు చేసిన రెండు తప్పులుగా చెబుతున్నారు. తాను బస చేసిన హోటల్ లో తన డ్రైవింగ్ లైసెన్స్ ను మర్చిపోవటం ఒకటైతే.. తనకు తోడుగా తెచ్చుకున్న ఇద్దరి సెల్ ఫోన్లు ఆన్ లో ఉంచటంగా తెలుస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా అడ్రస్ తెలుసుకోవటం తేలికైందని.. ఇక.. పరమాన్నం బాబాకు సహకరించిన ఇద్దరి ఫోన్లు ఆన్ లో ఉండటం.. దొంగబాబా కాల్ డేటాలో ఉన్న రీసెంట్ కాల్స్ ఆధారంగా వారిని అదుపులోకి తీసుకోవటంతో దొంగ బాబాను పట్టుకోవటం తేలికైందని చెబుతున్నారు.
Tags:    

Similar News