ఓట‌మి భ‌య‌మే.. కేసీఆర్ దూకుడుకు కార‌ణ‌మా?

Update: 2022-02-08 23:30 GMT
ఎప్పుడూ లేనిది కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై సీఎం కేసీఆర్ పోరాటానికి దిగారు. తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డంతో పాటు ప్ర‌ధాని ప‌ర్య‌ట‌కు వెళ్ల‌కుండా యుద్ధాన్ని తీవ్ర‌త‌రం చేశారు. బీజేపీ ప్ర‌భుత్వాన్ని మోడీని విమ‌ర్శిస్తూ.. రాష్ట్రంలోని ఆ పార్టీ నేత‌ల‌పైనా కేసీఆర్ మండిప‌డుతున్నారు. దీంతో ఆయ‌న‌లో ఈ దూకుడుకు కార‌ణ‌మేంటీ? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచే అవ‌కాశం ఉంద‌ని.. అధికారంలో రావాలంటే ద‌క్కాల్సిన మెజారిటీ కూడా రాద‌నే స‌ర్వేల రిపోర్ట్ ఆయ‌న‌కు చేతికి అందింద‌ని తెలుస్తోంది. అందుకే కేసీఆర్ ఇలా దూకుడుకు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని స‌మాచారం.

ఆ వ్య‌తిరేక‌త‌..

ఇటీవ‌ల ఈ మీడియా స‌మావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. మ‌రోసారి రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌ల అవ‌స‌రం లేద‌ని, ఈ సారి వంద‌కు పైగా సీట్లు గెలుస్తామ‌ని చెప్పారు. అందుకు త‌మ ద‌గ్గ‌ర బ్ర‌హ్మాస్త్రం ఉంద‌ని పేర్కొన్నారు. అయితే మ‌రోవైపు మాత్రం ఎనిమిదేళ్ల కేసీఆర్ పాల‌న‌లో ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌ను ఆయ‌న సీక్రెట్ స‌ర్వేల ద్వారా తెలుసుకున్నార‌ని స‌మాచారం. వివిధ ప్రైవేటు సంస్థ‌ల ద్వారా కేసీఆర్ విడివిడిగా స‌ర్వేలు చేయించార‌ని టాక్‌. వీటి నివేదిక‌లు ఆశాజ‌న‌కంగా లేవ‌ని తెలిసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు 35 నుంచి 40 సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని స‌ర్వేలో తేలిన‌ట్లు స‌మాచారం. అంటే అధికారానికి అవ‌స‌ర‌మైన 60 సీట్లు ద‌క్కించుకోవాలంటే శ్ర‌మించాల్సి ఉంటుంది.

అందుకే  ఇలా..

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో రూ.వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టినా టీఆర్ఎస్ గెల‌వ‌లేక‌పోయింద‌నే అభిప్రాయాలున్నాయి. ఇక స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ కిందా మీదా ప‌డి గెలిచారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం అంత సులువు కాదు. అందుకే స‌ర్వేలు చేయించిన కేసీఆర్ ఆ మేర‌కు ఎమ్మెల్యేల‌ను అప్ర‌మ‌త్తం చేశార‌ని తెలిసింది. వ‌రుస‌గా రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యేల‌పై ప్ర‌జ‌ల్లో కొంత వ్య‌తిరేక‌త ఉన్న‌ట్లు ఆయ‌న దృష్టికి వ‌చ్చింది. అందుకే మూడోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు కేసీఆర్ దూకుడు మంత్రాన్ని న‌మ్ముకున్నారు.

బీజేపీపై కాలు దువ్వుతున్నారు. ప్ర‌శాంత్ కిషోర్ టీంను రంగంలోకి దించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భారీ స్థాయిలో అభ్య‌ర్థుల‌ను మార్చే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. పశ్చిమ బెంగాల్‌లో ఈ ఫార్ములాతోనే మ‌మ‌తా బెన‌ర్జీ స‌క్సెస్ అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఇదే విధంగా ముందుకు వెళ్లాల‌న్న‌ది పీకే టీం ఆయ‌న‌కిచ్చిన స‌ల‌హా. అందుకే ఈ సారి సిట్టింగ్‌ల‌కు ఎక్కువ సంఖ్య‌లో సీట్లు ద‌క్క‌వ‌న్న చ‌ర్చ టీఆర్ఎస్ పార్టీలో జోరుగా సాగుతోంది.
Tags:    

Similar News