ఏపీ బీపీ : విశాఖ‌ను వ‌ద‌లని సాయిరెడ్డి.. జోరు త‌గ్గించ‌ని కొత్త మంత్రి

Update: 2022-04-25 04:34 GMT
మంత్రులు కొత్త‌వారు వ‌చ్చారు. ప్రాంతీయ సమ‌న్వ‌య‌క‌ర్త‌లూ కొత్త వారు వ‌చ్చారు. కొత్త నీరు వ‌చ్చినా పాత నీరు ఎక్క‌డికీ పోదు మ‌రియు పోలేదు. ఆ విధంగా ఆంధ్రావ‌ని లో రాజ‌కీయాలు సాగుతున్నాయి. ఆ విధంగా కొత్త మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ త‌న‌దైన ప్ర‌సంగం ఒక‌టి ఈ ఆదివ‌రాం ఇచ్చారు. పొత్తుల‌ పై సాయిరెడ్డి క‌న్నా మంచి క్లారిటీ ఇచ్చారు. సాయిరెడ్డి అదొక విధాన ప‌ర నిర్ణ‌య‌మ‌ని తానెలా స్ప‌ష్టం చేయ‌గ‌ల‌ను అని చెప్పి వెళ్లిపోయారు కాదు త‌ప్పుకున్నారు.

కానీ సాయిరెడ్డి క‌న్నాబాగా తెలిసిన మ‌రో తాజా నాయ‌కుడు మ‌రియు తాజా గొంతుక అయిన గుడివాడ అమర్నాథ్ రాష్ట్రంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ప్ర‌జ‌లు న‌వ్వుతార‌ని మాత్రం తేల్చేరు. ఆ విధంగా ఓవైపు సాయిరెడ్డి మ‌రో వైపు గుడివాడ అమ‌ర్నాథ్ ఇరువురూ విశాఖ కేంద్రంగా మొత్తం రాజ‌కీయంను ప్ర‌భావితం చేస్తూ ఉన్నారు. మొత్తం రాజ‌కీయం ను తారుమారు చేయ‌కుంటే చాలు.. అని అంటున్నారు కొంద‌రు.
 
ఈ నేప‌థ్యాన చాలా రోజుల త‌రువాత విశాఖ‌లో క‌నిపించి త‌న‌దైన ప‌ర్య‌ట‌న ను కొన‌సాగించారు సాయిరెడ్డి. ఆడిట‌ర్ సాయి రెడ్డి.. రాజ్య‌స‌భ స‌భ్యులు సాయి రెడ్డి. వైసీపీ పెద్ద సాయిరెడ్డి. విశాఖ రీజియ‌న్ ఎక్స్ - కో ఆర్డినేట‌ర్ సాయిరెడ్డి..ఇంకా ఏవేవో ఎన్నెన్నో ! సాయిరెడ్డి ఎప్పుడూ చెప్పిన విధంగానే ఆయ‌న‌కు ప‌ద‌వి పోయినా ఈ ప్రాంతం పై ఉన్న మ‌న‌సు కానీ మ‌క్కువ కానీ పోదు. అదే విధంగా ఆయ‌న చెప్పే నిజాలూ ఎక్క‌డికీ పోవు.

ఆయ‌న చెప్పే అబ‌ద్ధాలూ ఎక్క‌డికీ పోవు. అవి ఈ నేల‌లోనూ ఈ గాలిలోనూ నిక్షిప్తం అయి ఉంటాయి. ఆ విధంగా సాయిరెడ్డి పాపం ఇవాళ కొన్నంటే కొన్ని నిజాలు చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. రాష్ట్రంలో క్రైం రేటు ఎక్కువ‌గానే ఉంద‌ని కానీ చంద్ర‌బాబు ప్ర‌భుత్వంతో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పి సాయిరెడ్డి ఓ నిజం ఓ అబద్ధం ఏదో ఒక‌టి మీరే తేల్చుకుని తీరండి అని ఓ ప‌జిల్ విసిరిపోయారు.

ఇక మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ మాత్రం ప‌వ‌న్ పై విరుచుకుప‌డ్డారు. అంబ‌టి చెప్పిన మాదిరిగానే ఆయ‌న చంద్ర‌బాబు శ్రేయ‌స్సు కోసమే ప‌నిచేస్తున్నార‌ని అన్నారు. ప‌వ‌న్ ఎలాంటి వారో అన్న‌ది ఆయ‌న రెండో భార్య రేణు ను అడ‌గాల‌ని అన్నారు. బాగుంది..అంతా బాగుంది మ‌రి! ఈ ఎపిసోడ్ లోకి రేణును ఎందుకు తెచ్చారు. అస‌లు ఆ మంత్రికి ఏమ‌యినా తెలుసా ఏ రోజు అయినా ఆమె ప‌వ‌న్ ను ఉద్దేశించి ఒక్క చెడ్డ మాట అయినా చెప్పారా అంటూ జ‌న‌సేన మండిప‌డుతోంది.

కొత్త మంత్రులు పాల‌న‌పై కాకుండా వ్య‌క్తిగ‌త జీవితాల‌ పై శ్ర‌ద్ధ ఎక్కువ‌గా పెడుతున్నార‌ని, తాము కూడా ఇలాంటి వ్యాఖ్య‌లే చేస్తే ఏమౌతార‌ని జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు సోష‌ల్ మీడియా లో మంత్రి అమ‌ర్నాథ్ పై మండిప‌డుతున్నారు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ పొత్తుల‌పై సాయిరెడ్డి, ప‌వ‌న్ పై గుడివాడ తోచిన రీతిన మాట్లాడి వార్త‌ల్లో నిలిచారు. రాజ‌కీయం ఎలా ఉన్నా కూడా వైసీపీలో భ‌జ‌న బాగుంటుంది అని  జ‌న‌సేన అంటోంది. అదెందుకో సీఎం జ‌గ‌న్ కు న‌చ్చినా న‌చ్చ‌కున్నా య‌థావిధిగా సాగిపోతోంద‌ని కూడా అంటోంది.  వ‌హ్ వా వారెవ్వా అని కూడా అంటోంది.
Tags:    

Similar News