వైసీపీకి ఇరవై సీట్లు వస్తే గొప్పే.... సొంత ఎంపీ సంచలనం

Update: 2022-11-16 07:46 GMT
ఏపీలో బలమైన పార్టీగా వైసీపీ ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతారు. ఇక జగన్ అయితే 175 కి 175 సీట్లు ఎందుకు రావు అని పార్టీ వారికి చెబుతూ సమీక్షలు నిర్వహిస్తారు. ఏపీపీలో విపక్షం అన్నది లేకుండా మొత్తానికి మొత్తం మేమే గెలుచుకుంటామని జగన్ గట్టిగానే ప్రకటిస్తున్నారు. చాలా మంది వైసీపీ నేతలు, మంత్రులు కూడా తిరుగులేని మెజారిటీతో మరోసారి ఏపీలో వైసీపీ గెలిచి తీరుతుందని సవాళ్ళు కూడా చేస్తున్నారు.

ఇక విపక్షాలు మేమీ గెలుస్తామని చెప్పుకుంటున్నాయి. పొత్తుల విషయనంలో కూడా ఎవరి వ్యూహాలు వారు రూపకల్పన చేసుకుంటున్నాయి. సర్వేలు కూడా తమ పార్టీ గెలుస్తుంది అంటే తమ పార్టీ గెలుస్తుంది అని చెప్పుకునేలా చేయించుకుంటున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోతుంది అని ఆ పార్టీకే చెందిన ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు అంటున్నారు.

ఆయన తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు మాట దేముడెరుగు గట్టిగా ఇరవై సీట్లు వస్తే గొప్పే అని ఆయన చెప్పడం గమనార్హం. ఏపీ జనాలు వైసీపీ మీద పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని, వారు ఏపీలో వైసీపీని దించడానికి చూస్తున్నారని రఘురామ తనదైన సర్వేను ఆవిష్కరించారు.

అంతే కాదు, ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా కూడా జనాలు ఈసారి వైసీపీకి ఓటేయరని, అది తమ సొమ్ము అని తాము పన్నులతో కట్టిన డబ్బులనే తిరిగి ఇస్తున్నారు అని జనాలు తెలుసుకున్నారని ఆయన విశ్లేషిస్తున్నారు. ఏపీలో వైసీపీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయని, వ్యవస్థలను పూర్తిగా విద్వంశం చేయడం అభివృద్ధి లేకపోవడం, ప్రతిపక్షాలను హింసించడం వంటి అనేక కారణాల్తో పాటు ప్రజల మీద ఎన్నో భారాలు వేశారని అన్నారు.

విద్యుత్ పన్నులతో పాటు నిత్యావసర ధరలు పెంచారని, ఏపీలో పెట్రోల్ వంటి వాటి మీద పన్నులు ఎక్కువ చేశారని ఇదంతా సామాన్య, మధ్యతరగతి వర్గాలు వైసీపీ మీద తిరుగుబాటు చేయడానికి కారణాలు అని ఆయన అన్నారు. ఏపీలో రాజకీయంగా ఈసారి వైసీపీకి చుక్కలు చూపించేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారని రాజు గారు అంటున్నారు.

ఇదిలా ఉంటే రఘురామ మరింత ఆసక్తిని గొలిపే విషయాలను కూడా ప్రస్థావించారు. వైసీపీ తానుగా చేయించుకున్న సర్వేలలో కూడా ఈసారి నలభై సీట్లు మాత్రమే వస్తాయని తేలిందని చెప్పుకొచ్చారు. ఏపీలో వైసీపీకి ఈసారి ఉభయ గోదావరి జిల్లాల్తో పాటు, క్రిష్ణా ఉత్తరాంధ్రా జిల్లాలలో పరిస్థితి చాలా దయనీయంగా ఉందని రాజు  గారు పేర్కొన్నారు.

ఆఖరుకు ప్రశాంత్ కిశోర్ కూడా మరోసారి ఏపీలో వైసీపీ అధికారంలోకి రాదు అని తేల్చేశారు అని రాజు గారు చెప్పడం విశేషం. ఇక వచ్చే ఎన్నికల్లో సగం మంది సిట్టింగులకు టికెట్ ఇవ్వను అని జగన్ అంటే అది ప్రతిపక్షలా నెత్తిన పాలు పోసినట్లే అని రాజు చెప్పుకొచ్చారు. జగన్ ఈ మధ్య తీసుకున్న అనేక నిర్ణయాలు అన్నీ కూడా విపక్షానికి కలసివచ్చేవే అని ఆయన పేర్కొన్నరు. అదే విధంగా వైసీపీ డబ్బులిచ్చి గెలవాలని చూస్తోందని, కానీ ఆ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకుని జనాలు విపక్షానికి ఓటు వేస్తారని ఆయన చెబుతున్నారు.

తెలంగాణాలో మునుగోడు ఉప ఎన్నికల్లో టీయారెస్ గెలవడం వేరు, ఏపీలో రాజకీయ పరిస్థితులు వేరు అని ఆయన అంటున్నారు. కేసీయార్ పాలన ఏపీలో జగన్ పాలన కంటే చాలా రెట్లు బెటర్ గా ఉందని, అందుకే ఆ  ఉప ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించారని, ఏపీలో మాత్రం వైసీపీని చిత్తుగా జనాలు ఓడిస్తారు అంటూ రెబెల్ రాజా వారు తన సర్వేను చదివి వినిపించారు. నిజంగా అలాగే జరుగుతుందా. ఏపీలో వైసీపీ ఘోరంగా ఓడుతుందా. ఇరవై సీట్లు కూడా ఆ పార్టీకి రావా అంటే చూడాలి మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News