భారత్ vs పాక్: ఫైనల్ ఓవర్ థ్రిల్లర్.. భారత్ ను గెలిపించిన ఆ ఒక్కడు?

Update: 2022-08-29 04:58 GMT
ఆసియా కప్‌లో భాగంగా నిన్న రాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా ఆల్-రౌండ్ షోతో భారత్ గట్టెక్కింది. అతడే పాకిస్తాన్ ఓటమికి.. భారత్ గెలుపునకు కారణం. ఈ తక్కువ స్కోరింగ్ గేమ్‌ను గెలవడంలో పాండ్యానే భారత్ కు సహాయపడ్డాడు. భారత్ 19.4 ఓవర్లలో 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఇన్నింగ్స్‌ రెండో బంతికే ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ అవుటయ్యాడు. అనంతరం విరాట్ కోహ్లి (35), రోహిత్ శర్మ (12) ఆటను చక్కదిద్దారు. అయితే కొద్దిసేపటికే ఇద్దరూ ఔట్ కావడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి.

సూర్య కుమార్ యాదవ్ కూడా పెద్దగా స్కోర్ చేయకుండానే ఔటయ్యాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా (35), హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 33*) ఛేజింగ్‌ను జాగ్రత్తగా చివరి వరకూ తీసుకొచ్చి ఐదో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

చివరి ఓవర్‌లో జడేజా ఔటయ్యాడు. కానీ హార్దిక్ పాండ్యా తన ప్రశాంతతను చెదిరిపోనీయకుండా ఓటమి నుంచి భారత్ కు అద్భుతమైన గెలుపునందించాడు. జట్టుకు మరో రెండు బంతులు మిగిలి ఉండగానే సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. పాకిస్థాన్ తరఫున అరంగేట్రం చేసిన ఆటగాడు నసీమ్ షా (2/27), స్పిన్నర్ మహ్మద్ నవాజ్ (3/33) రాణించారు.

తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌కు సరైన ఆరంభం లభించలేదు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు బాబర్ ఆజం, ఫఖర్ జమాన్ ఎలాంటి ప్రభావం చూపకుండానే పెవిలియన్ బాట పట్టారు. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (43)కు కాసేపు ఇఫ్తికార్ అహ్మద్ (28) నుంచి మంచి మద్దతు లభించింది.

కానీ వీరిద్దరూ ఔటైనా తర్వాత పాక్ మళ్లీ పుంజుకోలేదు. చివరి బ్యాటర్ షానవాజ్ దహానీ రెండు సిక్సర్ల కారణంగా పాక్  147 పరుగులు చేయగలిగింది. లేదంటే 120 పరుగులలోపే కట్టడి అయ్యేది. 19.5 ఓవర్లలో ఆలౌట్ అయింది. భువీ నాలుగు వికెట్లు (4/26), హార్దిక్ మూడు (3/25), అవేశ్ రెండు వికెట్లు (2/33) తీశారు.

భారత్ తన తదుపరి మ్యాచ్‌లో ఆగస్టు 31న హాంకాంగ్‌తో తలపడనుంది. ఈ పాకిస్తాన్ పై విజయం సాధించిందంటే అదంతా హార్ధిక్ పాండ్యా చలువనే. అతడే టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. మొదట బౌలింగ్ లో కీలకమైన మూడు వికెట్లు సాధించి.. అనంతరం బ్యాటింగ్ లో చివరి వరకూ ఉండి విజయానికి చేరువ చేశాడు. చివరి 6 బంతుల్లో 7 పరుగులుచేయాల్సిన దశలో తొలి బంతికే జడేజా ఔట్ కావడం.. రెండో బంతికి దినేశ్ కార్తిక్ సింగిల్ తీయడం.. మూడో బంతి డాట్ బాల్ అయిపోయింది. అయితే 4వ బంతిని సిక్సర్ గా మలిచి పాండ్యా భారత్ ను గెలిపించాడు.
Tags:    

Similar News