సాయీ.. నాతో పాటే నువ్వూ.. రావ‌త్ మాట‌.. నిజ‌మైందా?!

Update: 2021-12-10 10:38 GMT
ఒక్కొక్క‌సారి.. మ‌నకు తెలియ‌కుండా.. కొన్ని విష‌యాలు నిజ‌మైపోతాయి. మ‌నం అనుకున్న‌ట్టుగానే సంఘ‌ట‌న‌లు జ‌రిగిపోతాయి. ఇటీవీల త‌మిళ‌నాడులో జ‌రిగిన హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం లో వీర మ‌ర‌ణం పొందిన మ‌న తెలుగు సైనికుడు.. లాన్స్ నాయ‌క్ సాయితేజ విష‌యంలోనూ.. ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది.

``సాయీ నాతోపాటే నువ్వు!`` అని భార‌త త్రివిధ ద‌ళాధిప‌తి.. రావ‌త్ చేసిన వ్యాఖ్య‌లు.. సాయి జీవితంలో నిజ‌మ‌య్యాయి. ఈ విష‌యాన్ని ఆయ‌న తండ్రి మీడియాతో పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌తి ఒక్క‌రూ క‌న్నీరుపెడుతున్నారు.

తమిళనాడు లో జరిగిన హెలికాప్టర్‌ దుర్ఘటన లో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లా వాసి లాన్స్‌నాయక్‌ సాయితేజకు చెందిన ఆసక్తికర అంశం బయటకొచ్చింది. సాయితేజ ఆర్మీలో కొనసాగడంపై అతడి తల్లిదండ్రులు కొంత ఆందోళన వ్యక్తం చేసినట్లు వెల్లడైంది. ఈ విషయంపై సాయితేజతో మాట్లాడినట్లు అతడి తండ్రి మోహన్‌ చెప్పారు.


‘నీతో పాటు తమ్ముడినీ ఆర్మీ కి తీసుకెళ్లావు. పదోన్నతులు తెచ్చుకుంటున్నావు. ఇదంతా బాగానే ఉన్నా.. ప్రాణాల మీదకు వచ్చే ఉద్యోగం మనకొద్దు.. మానుకో’ అంటూ తండ్రి మోహన్‌ చెప్పినా, సార్‌ (బిపిన్‌ రావత్‌)తోనే ఉంటానంటూ అమరుడైన లాన్స్‌నాయక్‌ సాయితేజ బదులిచ్చారు.

పారా కమాండోల కు మెరుగ్గా శిక్షణ ఇస్తుండటంతో బిపిన్‌ రావత్‌.. ఏడాది కిందట సాయితేజను తన వ్యక్తిగత భద్రత సిబ్బందిగా నియమించుకున్నారు. రావత్‌ను ఆయన కంటికి రెప్పలా చూసుకునేవారు. ఒకానొక సందర్భంలో తల్లిదండ్రుల ఒత్తిడితో.. ఆర్మీ నుంచి వైదొలుగుతానని సాయితేజ చెప్పారు. ‘నేను ఉన్నంతవరకూ నువ్వూ ఉండు సాయీ’ అని రావత్‌ చెప్పారని ఆయన తండ్రి మోహన్‌ పేర్కొన్నారు.

సాయితేజ్.. 2013లో ఆర్మీ సిఫాయిగా చేరాడు. సిఫాయిగా పని చేస్తూ ఏడాది తర్వాత పరీక్షలో ఉత్తీర్ణుడై పారా కమెండోగా ఎంపికయ్యాడు. లెవెన్త్ పారాలో లాన్స్ నాయక్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. బెంగళూరులో సిఫాయిలకు శిక్షకుడుగా పని చేసిన సాయితేజ్.. ప్రస్తుతం బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్ర‌మంలో రావ‌త్‌ కు సాయి కి మధ్య చాలా అన్యోన్య సంబంధం ఏర్ప‌డింది. త‌న కొడుకు మాదిరిగా రావ‌త్‌.. సాయిని తీర్చిదిద్దార‌ట‌.

ఈ క్ర‌మంలోనే సాయి తేజ ఉద్యోగానికి రిజైన్ చేస్తాన‌ని చెప్పిన‌ప్ప‌డు.. ``నాతో పాటే నువ్వూ.. నేను ఉన్న‌న్నాళ్లు నువ్వు కూడా ఉండు! త‌ర్వాత‌.. ఇద్ద‌రం వెళ్లిపోదాం!`` అని రావ‌త్ సూచించ‌డంతో సాయి ఉద్యోగంలో కొన‌సాగారు. అయితే.. ఊహించ‌ని ఘ‌ట‌న‌లో రావ‌త్‌తో పాటు.. సాయి కూడా అమ‌రులు కావ‌డం యాదృచ్ఛిక‌మే అయినా.. రావ‌త్ మాటే నిజం కావడం అంద‌రినీ క‌ల‌చి వేస్తోంది.

సాయితేజ్ కు భార్య శ్యామల, కుమారుడు మోక్షజ్ఞ, కూతురు దర్శిని ఉన్నారు. వీరి కుటుంబం గత ఏడాదిగా మదనపల్లె ఎస్బీఐ కాలనీలో నివాసం ఉంటుంది. మరో వైపు సాయితేజ్ మరణంతో.. గ్రామం లో విషాదం నెలకొంది.
Tags:    

Similar News