ఇదే మాట మిర్చి రైతుల‌కు చెప్ప‌గ‌ల‌వా కేటీఆర్‌?

Update: 2017-06-10 19:02 GMT
కొన్ని సంద‌ర్భాల్లో కొన్ని మాట‌లు మాట్లాడ‌క‌పోవ‌టం మంచిది. కానీ.. అధికారంలో ఉన్న రాజ‌కీయ నేత‌ల‌కు అలాంటివేమీ అస్స‌లు గుర్తుండ‌వు. ఓవైపు రైతుల ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా ఉండ‌టం.. మిర్చితో స‌హా కొన్ని పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు లేక‌పోవ‌టం.. అన్న‌దాత‌లు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్న వేళ‌.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ మ‌ధ్య కాలంలో నోరు విప్పితే కాంగ్రెస్ పార్టీని ఓ రేంజ్లో ఏసుకుంటున్న మంత్రి కేటీఆర్‌.. తాజాగా మ‌రోసారి అదే ప‌ని మొద‌లు పెట్టారు. కాంగ్రెస్ హ‌యాంలో వ్య‌వ‌సాయాన్ని నిర్ల‌క్ష్యం చేశార‌ని.. రైతుల్ని ప‌ట్టించుకోలేద‌న్నారు. రైతుల‌కు స‌రైన స‌మ‌యంలో విత్త‌నాలే కాదు ఎరువులు కూడా ఇవ్వ‌లేద‌న్నారు.

కానీ.. త‌మ స‌ర్కారు అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని చెప్పారు. కాంగ్రెస్ హ‌యాంలో ఎరువుల కోసం.. విత్త‌నాల కోసం  రైతులు చెప్పుల్ని వ‌రుస‌లో పెట్టి వేచి చూడాల్సి వ‌చ్చేద‌ని.. కానీ.. ఇప్పుడా ప‌రిస్థితి లేద‌న్నారు. స‌కాలంలో విత్త‌నాలు.. ఎరువుల్ని కూడా త‌మ ప్ర‌భుత్వం ఇస్తుంద‌న్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు పై నుంచి దైవ సంక‌ల్పం కూడా ఉంద‌ని.. అందుకే  వ‌ర్షాలు సైతం స‌కాలంలో ప‌డుతున్నాయ‌న్నారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూరులో మాజీ ఎంపీ.. ఇటీవ‌ల టీడీపీ నుంచి టీఆర్ ఎస్ లోకి చేరిన ర‌మేష్ రాథోడ్ కుమారుడి పెళ్లికి హాజ‌రైన ఆయ‌న‌.. ప్ర‌త్యేక హెలికాఫ్ట‌ర్ లో అదిలాబాద్‌.. బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేశారు. కాంగ్రెస్ హ‌యాంలోని లోపాల్ని గుక్క తిప్పుకోకుండా చెబుతున్న మంత్రి కేటీఆర్‌.. ఇదే మాట‌ల్ని గిట్టుబాటు ధ‌ర‌లు లేక వ‌రుస నిర‌స‌న‌ల్ని చేప‌ట్టిన మిర్చి రైతుల‌కు ద‌గ్గ‌ర ఎందుకు చెప్ప‌రు? ఓప‌క్క రైతుల‌కు తాము చాలా చేస్తున్న‌ట్లు చెబుతున్న కేటీఆర్‌.. ఆరుగాలం క‌ష్టించి పండించిన పంట‌కు గిట్ట‌బాటు ధ‌ర ఎందుకు క‌ల్పించలేక‌పోతున్నార‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా? అన్న‌ది ప్ర‌శ్న‌. మ‌రి.. దీనికి స‌మాధానం చెప్పేదెవ‌రు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News