పోలాండ్ నుంచి పోలవరానికి.

Update: 2016-06-27 10:47 GMT
  వైసీపీ అధినేత జగన్ విదేశీ టూర్ తరువాత మళ్లీ తన కార్యరంగంలోకి దిగిపోతున్నారు. సుమారు వారం రోజులుగా విదేశీ పర్యటనలో ఉన్న జగన్ ఆ సమయంలో రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఆటపాటలతో ఉల్లాసంగా గడపడానికే ప్రాధాన్యమిచ్చారు. బ్రిటన్ - ఐర్లాండ్ - పోలాండ్ వంటి దేశాల్లో తిరిగిన ఆయన అక్కడి నుంచి తిరిగి వస్తుండడంతో పాటు అప్పుడే కార్యాచరణ కూడా ఖరారు చేశారు. జులై 1 నుంచి ఆయన మళ్లీ జిల్లాల్లో తిరగబోతున్నారు.  జులై 1 - 2 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు.  పోలవరం ముంపు మండలాల్లో ఆయన పర్యటన ఉంటుంది.

కాగా జగన్ తన విదేశీ పర్యటనను ముగించుకుని వస్తున్నట్లుగా ఆయన ఫేస్ బుక్ ఖాతాలో ఫొటోలు పోస్ట్ చేశారు.  లగేజిని తానే స్వయంగా లాక్కొస్తున్న జగన్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ఈ రోజు వైరల్ అయింది.  కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ అక్కడ రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టేసి సరదాగా ఎంజాయ్ చేశారు. గోల్ఫ్ - చెస్ - ఫుట్ బాల్ క్రీడలతో ఉల్లాసంగా గడిపిన ఆయన స్వదేశానికి వచ్చేస్తున్నారు. విదేశీ పర్యటనను ముగించుకుని వస్తున్న జగన్ కు స్వాగతం పలికిన ఆయన అభిమానులు - నెటిజన్లు జగన్ తీరున ప్రశంసిస్తున్నారు. మందీమార్బలం - హంగు ఆర్భాటం లేకుండా వెళ్లడం.. తన లగేజినీ తానే స్వయంగా లాక్కుంటూ రావడం వంటివన్నీ ఆయన సింప్లిసిటీకి నిదర్శనాలని అంటున్నారు.

కాగా ఆయన రాష్ట్రానికి చేరుకున్న తరువాత ఒకట్రెండు రోజుల్లోనే ప్రభుత్వంపై పోరుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. విదేశీ పర్యటనలో కుటుంబంతో ఉల్లాసంగా గడిపిన ఆయన రీఛార్జి అయి వస్తుండడంతో టీడీపీపై రాజకీయ దాడి తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. జులై 1 - 2 తేదీల్లో ఆయన పోలవరం ముంపు గ్రామాల్లో పర్యటిస్తుండడంతో ప్రభుత్వంపై విమర్శలు - కార్యాచరణ కూడా తీవ్రంగానే ఉండొచ్చని భావిస్తున్నారు.

Tags:    

Similar News