జగన్ కి చంద్రబాబు...పవన్ కళ్యాణ్

Update: 2022-12-21 10:30 GMT
రాజకీయాలు అన్నవి ఫక్తు సేవాభావంతో చేసేవి. రాజకీయం వెనక ఉన్న అర్ధం పరమార్ధం అదే. ఆ విషయంలో అంతా కలసి ప్రజల కోసం పాటుపడాలనుకుంటారు. అధికారంలో చేతిలో ఉంటే ఇంకా ఎక్కువగా సేవ చేయవచ్చు. లేకపోతే విపక్షంలో ఉండి సలహాలు ఇవ్వవచ్చు. మొత్తానికి రాజకీయాల్లో ఉన్న వారు ఎపుడూ పోటీదారులే తప్ప శత్రువులు కారు. ప్రత్యర్ధులు అనుకున్నా తప్పులేదు కానీ విరోధులుగా భావించడమే విషాదం.

వర్తమాన రాజకీయాల్లో ప్రత్యర్ధులు లేకుండా పోయారు. అవతల వారిని పరమ శత్రువులుగా చూసే పరిస్థితి ఉంది. అందుకే కనీస రాజకీయ మర్యాదలు కూడా మంటగలసిపోతున్నాయి. ప్రజలకు రాజకీయ నాయకులు అందరూ సమానమే. వారిని తాము కలసికట్టుగా చూడాలని అంతా తమ కోసం మేలైన సమాజం కోసం పాటుపడితే చూసి సంతోషించాలని అనుకుంటారు.

కానీ ఏపీ లాంటి చోట అది కనాకష్టం అయిపోతోంది. ఏపీ అసెంబ్లీలో తప్ప ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఎక్కడా కనీసంగా కూడా సమావేశం అయిన సందర్భం ఉండడంలేదు. ఇక మిగిలిన ప్రతిపక్షాల సంగతి సరేసరి. అఖిలపక్షం అంటూ గతంలోని ప్రభుత్వంలో అయిదేళ్ల పాలనలో అనేకసార్లు కలిసేవి. రాష్ట్రం కోసం కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో విన్నా వినకపోయినా సలహాలు అయితే అడిగి వారి మాటను కూడా పట్టించుకునేవి.

ఇపుడు అలాంటి వాతావరణం లేదు. ఇక మిగిలినదల్లా నాయకుల పుట్టిన రోజు వేడుకలు.  ఎటూ సోషల్ మీడియా ఉంది. చేతిలో ట్విట్టర్ అకౌంట్ ఉంది కాబట్టి ఆ విధంగా అయినా ఒకరిని ఒకరు గ్రీట్ చేసుకుంటే అదే పదివేలు అన్న పరిస్థితి వస్తోంది. ఆ విధంగా మాత్రం కాసింతగా రాజకీయ మర్యాదలు ఏపీలో ఇంకా మిగిలి ఉన్నాయి. చంద్రబాబు పుట్టిన రోజు వేళ జగన్ గ్రీట్ చేస్తారు. జగన్ పుట్టిన రోజున చంద్రబాబు గ్రీట్ చేస్తారు. ఈ సంప్రదాయం మాత్రం నిరాటంకంగా సాగుతోంది.

తాజాగా జగన్ యాభై పుట్టిన రోజున తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గ్రీట్ చేశారు. బర్త్ డే గ్రీటింగ్స్ టు వైఎస్ జగన్ అంటూ బాబు ట్వీట్ చేసి అభినందించారు.

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జగన్ కి గ్రీట్ చేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు" అంటూ తన ప్రకటనలో పవన్  పేర్కొన్నారు. "ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను" అని తెలిపారు.

మొత్తానికి చూస్తే ఇది అందరూ మెచ్చే విధంగా ఉంది. ఈ గ్రీటింగ్స్ తో సరిపెట్టుకోకుండా ఏపీ అభివృద్ధి కోసం అందరు నాయకులు ఒక్కటిగా నిలిచి కృషి చేస్తే ఎంతో బాగుంటుంది కదా అని అంతా ఆశపడుతున్నారు. నిజానికి ఏపీలోని రాజకీయ పార్టీల మధ్య ఐక్యత లేకపోవడం వల్లనే ప్రత్యేక హోదా పోలవరం వంటి వాటితో పాటు విభజన హామీలను కేంద్రం తుంగలోకి తొక్కుతోంది అన్నది జనాలకు తెలుసు. మరి రాజకీయ మర్యాదల పేరిట ట్వీట్లతో సరిపెట్టకుండా అటూ ఇటూ కూడా నాయకులు చొరవ తీసుకుని ఏకత్రాటి మీదకు వస్తే అది ఏపీకి మేలు. వారికి కూడా ఎంతో పేరు. అలా జరుగుతుందని ఆశించడం అత్యాశే అయినా ఆశ ఉండడం మాత్రం తప్పు కాదు కదా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News