జ‌డ్జీల విష‌యంలో బాబు త‌ప్పు..కేసీఆర్ బెస్ట్‌

Update: 2018-05-12 06:42 GMT
న్యాయ‌మూర్తుల విష‌యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మ‌రోమారు ఇర‌కాటంలో ప‌డ్డారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల విష‌యంలో ఇప్ప‌టికే ప‌లు ఆరోప‌ణ‌లు ఆయ‌న‌పై రాగా...అది కొన‌సాగుతోంది. కేంద్ర న్యాయశాఖ మంత్రికి  రాసిన లేఖలు ఆక్షేపణీయమని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ - హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వీ ఈశ్వరయ్య అన్నారు. జనచైతన్య వేదిక - తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌ లో `రాజకీయాలలో సామాజిక న్యాయం` అంశంపై సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ న్యాయమూర్తుల నియామకాల్లో సామాజిక న్యాయం అవసరమని, ఈ విషయంలో చంద్రబాబు చర్యలు వాటికి విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో ముఖ్యమంత్రుల అభిప్రాయసేకరణలో సీఎం కేసీఆర్ సదభిప్రాయాన్ని వ్యక్తపర్చ‌గా - ఏపీ సీఎం చంద్రబాబు అందుకు భిన్నంగా వెనుకబడినవారికి ప్రాధాన్యం ఇవ్వవద్దనే అభిప్రాయాన్ని లేఖ ద్వారా కేంద్రానికి తెలుపడం కలకలం రేపుతున్నదన్నారు.

ఉన్నత న్యాయస్థానాల్లో బీసీలు - ఎస్సీల ప్రవేశాన్ని నిరోధించడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఈశ్వ‌ర‌య్య ఆరోపించారు. బీసీలకు క్షమాపణ చెప్పి చేసిన తప్పును చంద్రబాబు సరిదిద్దుకోవాలని ఆయన హితవుపలికారు. కొన్ని వర్గాలే రాజ్యాన్ని ఏలుతున్నాయని - వెనుకబడిన కులాలు పోరాడితేనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన కులాలకు రాజకీయాల్లో సామాజిక న్యాయం కల్పించాలన్నారు. దేవాలయాల్లో రాజకీయాలు చేయకుండా వాటి ప్రాచీనతను - పవిత్రతను కాపాడాలని చంద్రబాబుకు రాసిన లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు.
Tags:    

Similar News