మోడీకి దిమ్మ‌తిరిగే ప్లాన్ రెడీ చేస్తున్న కేసీఆర్

Update: 2017-02-08 05:49 GMT
ప్రధానమంత్రి నరేంద్రమోడీతో అపాయింట్ ఖరారు చేసి చివ‌రి నిమిషంలో ర‌ద్దుచేసిన తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ర‌గిలిపోతున్న‌ట్లు తెలుస్తోంది. అంతే ఘాటుగా కేంద్ర ప్ర‌భుత్వానికి త‌మ స‌త్తా చాట‌డంలో భాగంగా రెండు రోజులపాటు పార్లమెంట్‌ ఉభయ సభలకు  తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ విష‌యంలో త్వ‌ర‌లో నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు స‌మాచారం. అత్యంత ప్రాధాన్యతగల ఎస్సీ వర్గీకరణ అంశంతో పాటు కేంద్ర బడ్జెట్‌ లో రాష్ట్రానికి రావలసిన నిధులు, సంస్థల ఏర్పాటు విషయంలో జరిగిన అన్యాయాన్ని ప్రధాని దృష్టికి తీసుకురావాలని ఆయన భావించారు. తనతో పాటు అఖిలపక్ష బృందాన్ని హస్తినకు తీసుకువెళ్ళి ప్రధానిని కలిపిస్తే ఈ అంశానికి ఉన్న ప్రాధాన్యత తెలుస్తుందని సీఎం భావించారు.  ఈ మేరకు ఆయన రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాల నేతలకు లేఖలు రాసి సోమవారం ఢిల్లికి రావలసిందిగా కోరారు. అయితే చివరి క్షణంలో సీఎం కేసీఆర్‌ తో ప్రధాని అపాయింట్‌ మెంట్‌ రద్దు కావడంతో అఖిలపక్ష నేతల పర్యటన వాయిదా పడింది. అయినప్పటికీ కేసీఆర్‌ 5వ తేదీ సాయంత్రం ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం ఢిల్లికి బయలుదేరి వెళ్ళారు. సోమవారం కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ నివాసంలో జరిగిన విందు కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్‌ మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ - మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ను కలిసి ఏప్రిల్‌ లో నిర్వహిస్తున్న ఉస్మానియా వర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు రావలసిందిగా ఆహ్వానించారు. మంగళవారం సాయంత్రం వరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో హైదరాబాద్‌ బయలుదేరి వచ్చారు.

కానీ కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఎదురైన స్పంద‌న విష‌యంలో మాత్రం ఇటు టీఆర్ ఎస్ వ‌ర్గాలు - అటు కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణపై శాసనసభ ఇప్పటికే ఆమోదం తెలిపి కేంద్రానికి పంపిందని, అయినా ఎన్‌ డీఏ ప్రభుత్వం ఈ అంశాన్ని మరుగునపడేసే కార్యక్రమానికి ఒడిగట్టిందని తెరాస నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధానితో సమావేశం కావడానికి ముఖ్యమంత్రి కార్యాలయం అపాయింట్‌ మెంట్‌ కోరిందని, ఇచ్చినట్లే ఇచ్చి దాన్ని రద్దు చేశారని తెరాస శ్రేణులు ఆరోపిస్తున్నాయి. రెండు రోజులపాటు ఢిల్లిలో ఉన్న సీఎం కేసీఆర్‌ ప్రధానిని కలిసి రాష్ట్ర సమస్యలను ఏకరవు పెట్టాలని భావించారు. రాష్ట్రానికి రావలసిన ఆల్‌ ఇండియా ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెన్స్‌ (ఎయిమ్స్‌), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌ మెంట్‌ (ఐఐఎం)తో పాటు మిషన్‌ భగీరథ - కాకతీయ పథకాలకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని చివరిదాకా వేచిచూసినా ఫలితం దక్కకపోవడంతో కనీసం సవరించే బడ్జెట్‌ లోనైనా ఈ అంశాలను చేరుస్తారని భావించిన కేసీఆర్‌ ప్రధానిని కలిసినపుడు ఈ అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళాలని భావించారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలకు అనుమతులను మంజూరు చేసిన కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్న ఆగ్రహం ఇక్కడి ప్రభుత్వంలో ఉంది.

ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రు లను కలిసి ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అంశాలను, పథకాలను, నిధుల మంజూరును వారి దృష్టికి తీసుకువెళుతున్నా హామీ ఇస్తున్నారే తప్ప అమలులో ఎటువంటి పురోగతి కనిపించడం లేదని మండిపడుతున్నారు. గణతంత్ర దినోత్సవం శకటాల ఎంపికలోనూ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, తెలంగాణ తల్లి శకటాన్ని ప్రదర్శించాలని కేంద్రాన్ని ముందే అనుమతి కోరినా ఏమి పట్టనట్టు వ్యవహరించిందని ఆరోపిస్తున్నారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల అమలులోనూ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని, ఈ అంశాన్ని తమ పార్టీ ఎంపీలు, రాష్ట్రానికి చెందిన ప్రతినిధుల బృందం ప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఎటువంటి ఫలితం దక్కలేదన్న వాదనను తెరాస వినిపిస్తోంది. మొత్తంమీద రాష్ట్రానికి సంబంధించిన అంశాల అమలుతో పాటు పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న భావన ప్రజల్లో ఉందని ఇందుకు తాజా తార్కాణం ప్రధానమంత్రి అపాయింట్‌ మెంట్‌ ఇచ్చి రద్దు చేయడమేనని తెరాస నేతలు చెబుతున్నారు. బుధవారం నుంచే పార్లమెంట్‌ ఉభయ సభలకు దూరంగా ఉండాలన్న నిర్ణయాన్ని అమలు చేయాలని, అప్పటికీ ప్రధానమంత్రి కార్యాలయం స్పందించకపోతే గురువారం సాయంత్రం పార్టీ ఎంపీలు - ముఖ్య నేతలతో సమావేశమై భవిష్యత్‌ కార్యక్రమాన్ని ఖరారు చేయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం.

టీఆర్ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు జితేందర్‌ రెడ్డి ఆరోపణ‌లు సైతం సంచ‌ల‌నంగా మారాయి. రాష్ట్రానికి చెందిన కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయను కలిసిన జితేందర్‌ రెడ్డి భాజపా వల్లే తమ ముఖ్యమంత్రికి అపాయింట్‌ మెంట్‌ దొరకలేదని అసహనం వ్యక్తంచేసినట్టు ప్రచారం జరుగుతోంది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం అంశంలో ప్రధాని మోడీకి, కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంత మద్దతును తమ సీఎం కేసీఆర్‌ ఇచ్చారని, అయినా తమపట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆయన ఆగ్రహించారు. ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్రానికి, తమ పార్టీ తెరాసకు మేలుచేసే విధంగా వ్యవహరించడం లేదని దత్తాత్రేయతో జరిగిన భేటీ సందర్భంగా జితేందర్‌రెడ్డి వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు. తనను కలిసిన జితేందర్‌రెడ్డిన దత్తాత్రేయ బుజ్జగించే ప్రయత్నం చేశారు. ప్రధానితో కేసీఆర్‌ భేటీ వాయిదా పడిందే తప్ప రద్దు కాలేదని, ఈ భేటీని ప్రధానమంత్రి కార్యాలయం రద్దు చేశారని వస్తున్న వార్తలు సత్యదూరమని దత్తాత్రేయ చెప్పినట్టు సమాచారం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News