కేరళలో కరోనా బీభత్సం.. భారీగా కొత్త కేసులు , తస్మాత్ జాగ్రత్త

Update: 2021-08-26 05:30 GMT
మనదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తంగా కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నా, కేరళ రాష్ట్రంలో మాత్రం మరింతగా ఈ మహమ్మారి విజృంభిస్తోంది. మరోసారి భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 31వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. 200 మందికిపైగా మరణించారు. కేరళలో గడిచిన 24 గంటల వ్యవధిలో 31,445 కరోనా కేసులు నమోదైనట్లు కేరళ వైద్యారోగ్య శాఖ బుధవారం వెల్లడించింది.

దీనితో, మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 38,83,429కి చేరింది. కొత్తగా 215 మంది కరోనాతో మరణించడంతో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 19,972కి పెరిగింది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు కూడా 19.03గా నమోదు కావడం గమనార్హం. ఇటీవల ఓనమ్ పండగ కారణంగానే కరోనా కేసులు పెరిగాయని భావిస్తున్నారు. ఎర్నాకుళం జిల్లాలో అత్యధికంగా 4048 కరోనా కేసులు నమోదయ్యాయి. త్రిస్సూర్, కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో మూడువేలకు పైగా కరోనా కేసులు వెలుగుచూసినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. కేసులు పెరుగుదల నేపథ్యంలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ సెప్టెంబర్ నాటికి వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అధికారులు తెలిపారు.

ఇది ఇలావుండగా, కేరళలో అత్యధికంగా కేసులు నమోదు కావడంతో దేశ వ్యాప్తంగా కరోనా స్వల్పంగా పెరిగాయి. తాజాగా గత 24 గంటల్లో భారతదేశం 37,593 కరోనా వైరస్ కేసులను నమోదు చేసింది. ఇది నిన్నటి సంఖ్య (25,467) కంటే 47.6 శాతం ఎక్కువ. మరణాలు కూడా అధికంగా నమోదయ్యాయి. దేశంలో గత 24 గంటల్లో 648 మరణాలు నమోదయ్యాయి. ఇది నిన్న నమోదైన 354 మరణాల కంటే భారీ పెరుగుదలగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా 4,35,758 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 31,169 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు .ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.17 కోట్ల మంది కరోనాను జయించగా, రికవరీ రేటు 97.67 శాతానికి చేరుకుంది.

మరోవైపు కరోనా క్రియాశీల కేసుల రేటు గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల రేటు దేశంలో ఒక శాతం కంటే దిగువకు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,22,327 మంది కరోనాతో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.99గా నమోదవుతుంది. ఇక దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 61,90,930 మంది వ్యాక్సినేషన్ తీసుకున్నారు. ఇప్పటివరకు 59.55 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. మరోవైపు, మంగళవారం ఆప్ఘనిస్థాన్ నుంచి భారతదేశానికి తరలించిన 78 మందిలో 16 మందికి కరోనావైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.

ముందు జాగ్రత్త చర్యగా, మొత్తం 78 మందిని ఐసోలేషన్ లో ఉంచారు అధికారులు. తాలిబాన్ల ఆక్రమణ తర్వాత అక్కడ పరిస్థితులు మరింత దిగజారాయి. భారత్ పౌరులతో పాటు, ఆఫ్ఘనిస్తాన్ ను వీడిపోవాలనుకుంటున్న ఆదేశ పౌరులను సైతం తరలించడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది భారత ప్రభుత్వం. ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి 228 మంది భారతీయ పౌరులతో సహా, మొత్తం 626 మందిని తరలించినట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. వారిలో 77 మంది ఆఫ్ఘన్ సిక్కులు ఉన్నారని కేంద్ర మంత్రి తెలిపారు.
Tags:    

Similar News