ఎన్నారైలు స్వ‌దేశానికి ఒక్క రోజుకి ఎన్ని కోట్లు పంపిస్తారో తెలుసా ?

Update: 2021-06-30 12:53 GMT
క‌రోనా విజృంభణ స‌మ‌యంలో కూడా ఎన్నారైలు స్వదేశానికి పంపిన‌ సొమ్ముల్లో పెద్ద‌గా మార్పు లేద‌ని ఈ మధ్యనే విడుద‌లైన గ‌ణాంకాలు చెప్తున్నాయి. ఇక మాతృదేశానికి అధిక మొత్తంలో న‌గదు పంపిన‌ ఎన్నారైలలో కేరళ ప్ర‌వాసులే అగ్రస్థానంలో ఉన్నారు. తాజాగా విడుద‌లైన‌ స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ నివేదిక ప్రకారం కేరళ రాష్ట్రానికి చెందిన ఎన్నారైలు 2020 ఏడాదికి గాను త‌మ‌వారికి  రూ.2.27 లక్షల కోట్లు పంపారు. కాగా,  2019 ఏడాదితో పోలిస్తే డిపాజిట్లు 14 శాతం పెరిగాయి. 2019లో ఆ రాష్ట్ర‌ ఎన్నారైల నుంచి మొత్తం 1,99,781 కోట్ల డిపాజిట్లు వ‌స్తే, 2020లో డిపాజిట్లు 14 శాతం మేర పెరగ‌డంతో అద‌నంగా రూ. 27,649 కోట్లు వచ్చాయి. ఎన్నారైల నుంచి వస్తున్న డిపాజిట్లలో కేరళ నుంచే అధికమ‌ని ఎస్‌ ఎల్‌ బీసీ వెల్ల‌డించింది.

దీనికి కార‌ణం ఇత‌ర‌ రాష్ట్రాలతో పోలిస్తే కేర‌ళ ఎన్నారైలే ఎక్కువ‌గా విదేశాల్లో ఉంటున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం సుమారు 40 లక్షల మంది కేరళ వాసులు విదేశాలలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్ర‌తి ఏడాది వీరు వేల కోట్లు స్వ‌దేశంలోని తమవారికి పంపిస్తున్నారు. ఇదిలాఉంటే.. వివిధ దేశాల్లో ఉంటున్న మ‌న‌వాళ్లు రోజుకు స్వ‌దేశానికి పంపిస్తున్న న‌గ‌దు ఎంతో తెలుసా? అక్ష‌రాల రూ. 1,670 కోట్లు. ఉపాధి కోసం విదేశాల‌కు వెళ్లి, అక్క‌డ ప‌ని చేస్తూ సంపాదించే దాంట్లో కొంత మొత్తం స్వ‌దేశంలోని త‌మ‌వారికి ప్ర‌వాసులు పంపించే సొమ్మునే రెమిటెన్స్‌ అంటారు. ప్రపంచ బ్యాంకు తాజా గణాంకాల ప్రకారం ఈ విషయంలో ప్రపంచంలోని ఇత‌ర‌ దేశాలతో పోలిస్తే భారత్ మొద‌టి స్థానంలో ఉంది. వివిధ దేశాల్లో ఉన్న ఎన్నారైలు 2020లో స్వ‌దేశానికి పంపిన మొత్తం 83.1 బిలియన్ డాలర్లు  భార‌త క‌రెన్సీలో సుమారు రూ. 6లక్షల కోట్లు.  

ఎన్నారై రెమిటెన్స్‌లో టాప్‌-10 రాష్ట్రాల జాబితా ఇదే..

1. కేరళ

2. మహారాష్ట్ర

3. కర్నాట‌క‌

4. తమిళనాడు

5. ఢిల్లీ

6. ఆంధ్రప్రదేశ్

7. ఉత్తరప్రదేశ్

8. పశ్చిమబెంగాల్‌

9. గుజరాత్‌

10. పంజాబ్‌
Tags:    

Similar News