పార్టీ మార్పు ప్రచారంపై కొండా మురళి క్లారిటీ

Update: 2020-12-18 17:30 GMT
130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ....ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఏఐసీసీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు....మరో వైపు రాహుల్ గాంధీ నాయకత్వంపై సీనియర్ల అసంతృప్తి...ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిగా పార్టీ వీడుతున్న కీలక నేతలు....ఇలా గతంలో ఓ వెలుగు వెలిగిన పార్టీ ప్రస్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఎదుర్కొంటోన్న పరిస్థితే తెలంగాణలోనూ దాదాపుగా ఉంది. ఉత్తమ్ రాజీనామా చేసి చాలారోజులు కావస్తోన్నప్పటికీ...టీ పీసీసీ చీఫ్ ఎంపికలో జాప్యం...కేడర్ నిర్వీర్యం కావడం వంటి కారణాలతో కొందరు నేతలు పార్టీ వీడతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేత కొండా మురళీ పార్టీ మారతారనే ప్రచారం జోరందుకుంది. అయితే, ఈ ప్రచారాన్ని గతంలోనే కొండా మురళీ ఖండించినా...వదంతులు మాత్రం ఆగడం లేదు. దీంతో, తాజాగా తన పార్టీ మార్పు ప్రచారంపై మీడియా ప్రతినిధులకు కొండా మురళీ క్లారిటీ ఇచ్చారు.

తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని - పార్టీని వీడేది లేదని కొండా మురళి తేల్చి చెప్పారు. గతంలో తాను పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో కొండా మురళి వివరించారు. గతంలో తనకు వరంగల్ తూర్పు టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లో చేరాల్సి వచ్చిందని మురళి తెలిపారు. అయితే, ఇతర పార్టీల్లో తమకు సరైన ప్రాధాన్యం దక్కలేదన్నారు. టీఆర్ ఎస్‌ దొరల పార్టీ అని - ఆ పార్టీలో మిగతా నేతలకు ప్రాధాన్యం ఉండదని అన్నారు. అవసరం కోసం వాడుకొని టికెట్ల విషయంలో పక్కన పెట్టారని తెలిపారు. తప్పక తమ సొంతగూటికి వచ్చామని - కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కుతోందని చెప్పారు. ఇదే విషయాన్ని ఇటీవల తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మానిక్కం ఠాగూర్‌ తో భేటీ సమయంలోనూ వెల్లడించానని అన్నారు. వదంతులు నమ్మవద్దని - కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
Tags:    

Similar News