కృష్ణంరాజు విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం

Update: 2022-09-16 14:31 GMT
హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో దివంగత సినీ నటుడు కృష్ణంరాజు సంస్మరణ సభ  సాగింది. ఈ సందర్భంగా కృష్ణంరాజు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తరుఫున కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఫిలింనగర్ సొసైటీలో దివంగత సినీ నటుడు కృష్ణంరాజు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో కృష్ణంరాజు సంస్మరణ సభను నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఎన్టీఆర్, ఏఏన్నార్ తర్వాత విలక్షణ నటుడు కృష్ణంరాజు అని కొనియాడారు. అందరూ చనిపోతారని.. కొంతమందే చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. అలాంటి వారిలో కృష్ణంరాజు ఒకరు అని పేర్కొన్నారు.నేను చిన్నప్పుడు కృష్ణంరాజు సినిమాలు చూసి పెరిగానని.. మర్యాదకు మారు పేరు కృష్ణంరాజు అని.. ప్రభాస్ కూడా ఆ మంచితనం వచ్చిందని తెలిపారు.

ఇక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కృష్ణంరాజు మరణం మా పార్టీ దురదృష్టం. కృష్ణంరాజు చనిపోగానే రాజ్ నాథ్ సింగ్ కాల్ చేసి ప్రభాస్ నంబర్ అడిగారు.  ప్రభాస్ తో ఫోన్ లో మాట్లాడినా తన మనసులో వెలితి ఉందని.. వాళ్ల కుటుంబాన్ని కలుద్దామని రాజ్ నాథ్ అన్నారు.

కృష్ణంరాజు ఇటీవలే కాల్ చేసి ప్రధానిని కలవాలని అన్నారు. అల్లూరి విగ్రహం ఆవిష్కరణకు భీమవరం వస్తానని కృష్ణంరాజు అన్నారు. కృష్ణంరాజు తన ట్రీట్ మెంట్ కోసం లండన్ వెళ్లడానికి మేం అన్ని ఏర్పాట్లు చేశాం. కరోనా వల్ల వెళ్లలేకపోయారు. కల్మషం లేని వ్యక్తి కృష్ణంరాజు ’అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన జ్ఞాపకాలను తలుచుకున్నారు.

కాగా తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏ సినీ ప్రముఖుడి విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. మొదటి విగ్రహం కృష్ణంరాజుదే కావడం విశేషం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News