ఇదెక్కడి ఆరాచకం? ఎస్సై లాఠీ లాక్కొని మరీ అతన్ని చితక్కొట్టిన మందుబాబులు

Update: 2022-03-18 04:34 GMT
అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పూటుగా మద్యం సేవించి ఆరాచకం గా వ్యవహరించిన మందుబాబుల ఉదంతంగా దీన్ని చెప్పాలి. నాటుసారా విక్రయ కేంద్రాలపై దాడి చేసే ప్రయత్నం చేసిన అబ్కారీ ఎస్సై మీద మందుబాబులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. వారి దగ్గరున్న లాఠీలను లాక్కొని మరీ చితకబాదేసిన షాకింగ్ ఉదంతానికి వేదికగా మారింది నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలంలోని ఒక ప్రాంతం.

అక్రమంగా అమ్ముతున్న నాటుసారా విక్రయ కేంద్రాలపై దాడి చేసేందుకు అబ్కారీ ఎస్సై నర్సింలు.. కానిస్టేబుల్ కలిసి అధికారిక వాహనంలో వెళ్లారు. అక్రమ సారా కేంద్రం వద్ద మద్యం తాగుతున్న నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా.. వారు పారిపోయే ప్రయత్నం చేశారు. నలుగురిలో ఒకరిని పట్టుకున్న అధికారులు.. అతడ్ని విచారించారు. తిరిగి వెళ్లే కమ్రంలో పారిపోయిన ముగ్గురు వచ్చి.. అధికారులపై దాడికి యత్నించారు.

ఇందులో భాగంగా ఎస్సై దగ్గరున్న లాఠీని లాక్కొని.. సదరు ఎస్సైను..కానిస్టేబుల్ ను చితకబాదేశారు. దీంతో అధికారులు కాస్తా బాధితులుగా మారారు. అబ్కారీ ఎస్సై కంప్లైంట్ ఇచ్చిన మేరకు నలుగురి మీద కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై శ్రావణ్ కుమార్ చెబితే.. ఇంత జరిగిన తర్వాత కూడా నిందితుల్ని రిమాండ్ కు తరలించకపోవటం గమనార్హం. దీనికి కారణం.. రాజకీయ ఒత్తిళ్లేనని చెబుతున్నారు.

నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే.. అబ్కారీ ఎస్సై లాఠీ లాక్కొని మరీ దాడి చేసి.. దారుణంగా కొట్టిన వారిని సైతం రిమాండ్ కు తరలించకపోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
Tags:    

Similar News