తొలి మొక్కు అక్కడే : టీడీపీలో టికెట్ కి దారేదంటే...?

Update: 2022-06-09 16:30 GMT
ఎన్నికలు టికెట్ గెలుపు ఇదే రాజకీయ పరిభాష. ఏ నాయకుడు అయినా ఎమ్మెల్యే కావాలనే కోరుకుంటారు. తన తాహతు, స్తోమత పక్కన పెడితే ముందు తన మొర ఆలకించే వారు ఎవరని పార్టీలో చూసుకుంటారు. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే రెండేళ్ల ముందే హడావుడి  మొదలైపోయింది. ఈ మధ్య చంద్రబాబు కర్నూల్ టూర్ లో డోన్ కి వెళ్ళినపుడు అక్కడా సుబ్బారెడ్డిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిగా ప్రకటించి వచ్చారు.

అదే విధంగా బాదుడే బాదుడులో మరి కొంతమందికి సూచనాప్రాయంగా పనిచేసుకోండి అని కూడా అధినాయకత్వం  చెప్పి ఉంచింది. ఇక మహనాడు మీటింగ్ ఒక వైపు జరుగుతూండగానే చినబాబు లోకేష్ మీడియాతో చిట్ చాట్ చేస్తూ బాంబు లాంటి వార్తనే వదిలారు. వచ్చే ఎన్నికల్లో మూడు సార్లు ఓడిన వారికి టికెట్లు ఇవ్వమని స్పష్టం చేయడంతో పాటు సీనియర్లు తప్పుకోవాల్సిందే అని హింట్ ఇచ్చేశారు.

దాంతో టీడీపీలో టికెట్ పట్టాలంటే ఎవరిని పట్టాలో లోకేష్ స్వయంగా చెప్పినట్లు అయింది. ఇది జరిగిన మరుసటి రోజే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కుమార్తె కైవల్యారెడ్డి లోకేష్ ని స్వయంగా కలసి వచ్చారు. అధినేత చంద్రబాబు ఉండగానే ఆమె  లోకేష్ తో సమావేశం కావడం మహానాడు సాక్షిగా పార్టీకి కొత్త సంకేతం ఇచ్చినట్లు  అయింది.

ఇక లేటెస్ట్ గా సీఎం జగన్ సొంత జిల్లా కడప నుంచి కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి స్వయంగా వెళ్ళి లోకేష్ ని కలసివచ్చారు. ఆయన సీనియర్ మోస్ట్ నేత. 1994, 2004 లో టీడీపీ నుంచి, 2009లో కాంగ్రెస్ నుంచి వీరశివారెడ్డి గెలిచారు.  వచ్చే ఎన్నికల్లో పోటీ కోసమే ఆయన లోకేష్ ని కలిసారు అని చెబుతున్నారు.  ఇక కమలాపురం విషయానికి వస్తే ఈ సీటులో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఎవరో కాదు జగన్ సొంత మేనమామ రవీంద్రారెడ్డి. ఆయనను ఓడించాలన్న కసి ఎటూ టీడీపీకి ఉంటుంది.

మరో వైపు చూస్తే వీరశివారెడ్డి వంటి సీనియర్ చంద్రబాబుని కలవకుండా లోకేష్ ని కలవడమే చర్చగా ఉంది. అంటే టీడీపీలో టికెట్ ఇచ్చే సెంటర్ పాయింట్ లోకేష్ అన్నది పార్టీ నేతలకు అర్ధమవుతోంది అంటున్నారు. ఇక  కమలాపురం ఇంచార్జిగా టీడీపీ సీనియర్ నేత పుత్తా నరసింహారెడ్డి ఉన్నారు. ఆయనకు టికెట్ ఇచ్చే ఆలోచనలో బాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమానికి పుత్తా జనాలను వెల్లువలా తీసుకువచ్చారట.

మరి బాబు మనసు కూడా మార్చి తనకు టికెట్ ఇప్పించే సత్తా లోకేష్ బాబుకు ఉందని భావించే వీరశివారెడ్డి అటు నుంచి నరుక్కు వచ్చారని అంటున్నారు. ఇవనీ చూస్తూంటే టీడీపీలో లోకేష్ ప్రయారిటీ ఏంటి అన్నది తెలుస్తోంది అంటున్నారు. ఇక చంద్రబాబు కూడా ఎటూ లోకేష్ మాట కాదనలేరు కాబట్టి నేరుగా చినబాబుకే తొలి మొక్కు చెల్లిస్తే సరిపోతుంది కదా అన్న ఆలోచనను చాలా మంది నేతలు చేస్తున్నారుట.

ఇక ఇదే కడప జిల్లా నుంచి మరో మాజీ మంత్రి కూడా త్వరలో లోకేష్ బాబుని కలుస్తారు అని అంటున్నారు. అలాగే కోస్తా జిల్లాలకు చెందిన నేతలు, ఉత్తరాంధ్రాలో పార్టీ మారాలనుకుంటున్న వారు లోకేష్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. చూస్తూండగానే టీడీపీలో లోకేష్ వెయిట్ అలా పెరిగిపోతోంది. ఎవరు అవునన్నా కాదన్నా 2024 ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే విషయంలో  లోకేష్ బాబు అత్యంత కీలకం అని అంటున్నారు. అందుకే గుంటూరు జిల్లాకు చెందిన యరపతినేని శ్రీనివాసరావు వంటి నేతలు తరచూ లోకేష్ తోనే టచ్ లోకి వస్తున్నారుట.
Tags:    

Similar News