ప్రాణం తీసిన మ్యాజిక్.. గంగానదిలో గల్లంతైన జాదూగర్

Update: 2019-06-17 06:07 GMT
చిన్నచిన్న కనికట్టులతో ఆశ్చర్యపరిచే మెజీషియన్లు కొందరైతే... ప్రమాదకర విన్యాసాలతో మెస్మరైజ్ చేసేవారు మరికొందరు. చూడ్డానికి ఎంత ప్రమాదకరంగా అనిపించినా తమకు అలవాటైన కిటుకులతో సురక్షితంగానే ఇలాంటి మ్యాజిక్కులు చేస్తుంటారు ఇంద్రజాలికులు. కానీ.. ఒక్కోసారి మాత్రం ఇలాంటి ప్రమాదకర మ్యాజిక్కులు ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా కోల్‌ కతాలోని హౌరా బ్రిడ్జి వద్ద మ్యాజిక్ ప్రదర్శన ఇచ్చిన ప్రముఖ ఇంద్రజాలికుడు ఒకరు నదిలో మునిగిపోయి ఆచూకీ లేకుండా పోయారు.

పశ్చిమబెంగాల్‌ కు చెందిన చంచల్ లాహిరిని అంతా జాదూగర్ మంద్‌ రాకే అంటారు. ఆయన అనూహ్యమైన ఫీట్లు చేస్తూ అభిమానులను సంపాదించుకున్నారు. అయితే.. నిన్న హౌరా బ్రిడ్జి వద్ద కాళ్లు, చేతులు గొలుసులతో బంధించి నదిలో దిగి బయటకు వచ్చే ఫీట్ ప్రదర్శించే క్రమంలో గల్లంతయ్యారు. పోలీసులు, ఆయన కుటుంబసభ్యులు, షో చూడ్డానికి వచ్చిన వందలాది మంది చూస్తుండగానే ఈ విషాదం జరిగింది.

కాళ్లు చేతులను సంకెళ్లు, తాళ్లతో బంధించిన లాహిరిని ఓ గ్లాస్ బాక్స్‌ లపెట్టి తాళం వేసి.. గంగానదిలో ముంచాక లాహిరి ఆ సంకెళ్లు తెంచుకుని బాక్స్ తెరుచుని బయటకు రావాలి. ఇదీ విన్యాసం. అయితే, అలా దిగిన లాహిరి ఎంతకూ బయటకు రాకపోవడంతో పోలీసులు ఆయన కోసం గాలింపు మొదలుపెట్టారు. అయినప్పటికీ ఆయన జాడ కానరాలేదు. ఈ విన్యాసానికి ముందు లాహిరి మాట్లాడుతూ.. తాను 21 ఏళ్ల క్రితం ఇదే ప్రదేశంలో ఇదే విన్యాసాన్ని విజయవంతంగా చేశానని చెప్పుకొచ్చారు. అప్పట్లో 21 సెకన్లలోనే బయటకు వచ్చేశానని వివరించారు. ఈసారి బయటకు రావడం కష్టమేనని, వస్తే మ్యాజిక్ అవుతుందని, లేదంటే ట్రాజిక్ అవుతుందని వ్యాఖ్యానించారు. అయితే, ఆయన చెప్పినట్టుగానే ఈ మ్యాజిక్ కాస్తా విషాదంతంగా ముగిసింది.
    

Tags:    

Similar News