మ‌ళ్లీ గ‌వ‌ర్న‌ర్‌ గిరీ పంచాయి‌తీ..బేడీకి వ్య‌తిరేకంగా మంత్రి దీక్ష‌

Update: 2020-04-29 10:50 GMT
గ‌వ‌ర్నర్ వ్య‌వ‌స్థ‌పై త‌ర‌చూ వివాదాలు కొన‌సాగుతున్నాయి. గ‌తంలో మ‌హారాష్ట్ర‌ - క‌ర్నాట‌క - ఢిల్లీ‌లో చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. ప‌శ్చిమ బెంగాల్‌, పుదుచ్చేరిలో త‌రచూ గ‌వ‌ర్న‌ర్‌ కు శాస‌న వ్య‌వ‌స్థ‌కు మ‌ధ్య వివాదం రాజుకుంటూనే ఉంటుంది. తాజాగా మ‌రోసారి పుదుచ్చేరిలో గ‌వ‌ర్న‌ర్ తీరుపై పాల‌క ప‌క్షం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. గ‌వ‌ర్న‌ర్ తీరుపై ఓ మంత్రి దీక్ష‌కు దిగారు. లాక్‌ డౌన్‌ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా గవర్నర్ కిరణ్ బేడి తీసుకున్న నిర్ణయాలను నిర‌సిస్తూ మల్లాడి కృష్ణారావు దీక్ష ప్రారంభించారు. దీంతో పుదుచ్చేరిలో ఒక్క‌సారిగా ప‌రిణామాలు ఆందోళ‌న‌క‌రంగా మారాయి. ఈ క్ర‌మంలో గవర్నర్ కిరణ్ బేడీ తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి - పుదుచ్చేరి ముఖ్య‌మంత్రి నారాయణ స్వామికి - అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి ఆ మంత్రి ఫిర్యాదు చేశారు.

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యానాం ప్రజలను క్వారెంటైన్‌ కు పంపకుండా.. కనీసం ఆస్ప‌త్రిలో పరీక్షలు కూడా చేయించకుండా మూడు రోజుల పాటు చెక్‌పోస్టు దగ్గర నిలిపివేయడంపై మంత్రి మల్లాడి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయ‌న మండిప‌డుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యానాం ప్రజలను ఎవ‌రినీ బ‌య‌ట‌కు రానివ్వొద్ద‌ని లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడీ ఆదేశాలు జారీ చేయ‌డంపై ఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న తన ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురి కావడంపై మంత్రి మల్లాడి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో బుధ‌వారం పుదుచ్చేరి అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయం ఎదుట మల్లాడి కృష్ణారావు దీక్ష చేపట్టారు. గవర్నర్ కిరణ్ బేడీ మొదటినుంచి ఏకపక్ష నిర్ణయాలతో పుదుచ్చేరి ప్రభుత్వానికి ఇబ్బందులు కలగచేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆందోళ‌న‌తో ప‌రిస్థితులు ఉద్రిక్త‌మ‌వుతాయ‌ని భావించి ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఇత‌ర మంత్రులను పంపించి కృష్ణారావుతో దీక్ష విరమింపజేశారు. అయితే ఇదొక్క‌టే కాదు గ‌తంలోనూ గ‌వ‌ర్న‌ర్‌ కు - రాష్ట్ర ప్ర‌భుత్వానికి మ‌ధ్య తీవ్ర వివాదం ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే.
Tags:    

Similar News