జీఎస్టీ...గ్రేట్ సెల్ఫిష్ ట్యాక్స్‌

Update: 2017-11-06 13:13 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మాన‌స పుత్రిక అయిన జీఎస్టీకి వినూత్న భాష్యాలు కొన‌సాగుతున్నాయి. మొన్నటికి మొన్న దీనిని గబ్బర్‌సింగ్ ట్యాక్స్ అని రాహుల్ గాంధీ అన్న విషయం తెలిసిందే. ఇదే వ‌రుస‌లో జీఎస్టీకి మరో కొత్త అర్థం వచ్చింది. తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ జీఎస్టీకి గ్రేట్ సెల్ఫిష్ ట్యాక్స్ అని పేరు పెట్టారు. ఇది ప్రజలను హింసించడానికి - ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి తీసుకొచ్చిన ట్యాక్స్ అని మమతా ఆరోపించారు. `గ్రేట్ సెల్ఫిష్ ట్యాక్స్ ప్రజలను హింసించడానికి. ఉద్యోగాలను పోగొట్టడానికి. వ్యాపారాలను దెబ్బతీయడానికి. ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి. జీఎస్టీని సరిగా అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది` అని మమతా ట్విట్టర్‌ లో విమర్శించారు.

పెద్ద‌ నోట్ల రద్దు ఓ విపత్తు అని - నవంబర్ 8న దీనిని నిరసిస్తూ తమ ప్రొఫైల్ పిక్చర్ల స్థానంలో బ్లాక్ స్కేర్‌ లను పెట్టుకోవాలని మ‌మ‌తా బెన‌ర్జీ పిలుపునిచ్చారు. విప‌క్షాలు త‌మ నిర‌స‌న‌ల‌ను ఐక్యంగా చాటాల‌ని..ప్ర‌జ‌ల త‌ర‌ఫున గ‌ళం వినిపించాల‌ని మ‌మ‌తా బెన‌ర్జీ కోరారు. నోట్ల రద్దు పేరుతో ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కుదేలు చేసిన విధానాన్ని వివ‌రించాల‌ని ఆమె కోరారు.

మ‌రోవైపు ఈ నెల 10వ తేదీన జరిగే జీఎస్టి కౌన్సిల్‌ సమావేశంలో సామాన్యుడు విరివిగా వినియోగించే వస్తువుల పన్ను తగ్గించే ఆలోచనలో కౌన్సిల్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు చేతితో తయారు చేసిన ఫర్నిచర్‌ - ప్లాస్టిక్‌ ఉత్పత్తులు - అలాగే రోజు వాడే షాంపులను చెప్పుకోవచ్చు. దీంతో పాటు జీఎస్టి రిటర్న్స్‌ ఫైలింగ్‌ నిబంధనలను కూడా సడలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం గువాహతిలో జరిగే రెండు రోజుల జీఎస్టి కౌన్సిల్‌ సమావేశానికి ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ అధ్యక్షత వహిస్తారు. జీఎస్టిలో 28 శాతం బ్రాకెట్లోకి వచ్చే పలు రోజు వారి వస్తువుల పన్నును మరింత తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన వస్తు సేవల పన్ను తర్వాత కొన్ని వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్యానెల్‌ పన్ను రేట్లను మరింత తగ్గించాలని చూస్తోంది. గతంలో కొన్ని వస్తువులపై ఎక్సైజ్‌ సుంకం మినహాయింపు లేదా తక్కువ వ్యాట్‌ ఉండేది. జీఎస్టి అమల్లోకి వచ్చిన తర్వాత వీటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. జీఎస్టి అమల్లోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న సుమారు డజను కేంద్ర రాష్ట్ర స్థాయి పన్నులు మటుమాయం అయ్యాయి. జీఎస్టి ప్యానెల్‌ ఇప్పటి పలు మార్లు సమావేశాలు నిర్వహించింది. వ్యాపారులతో పాటు వినియోగదారుడికి ఊరట కలిగించేందుకు పన్నుల్లో పలు మార్పులు చేర్పులు చేస్తూ వస్తోంది. 28 శాతం పన్ను బ్రాకెట్లో ఉన్నవస్తువుల రేట్లు వచ్చే జీఎస్టి కౌన్సిల్‌ సమావేశంలో వీటిని 18శాతానికి తగ్గించే అవకాశాలున్నాయి. పన్నులు తగ్గించే వస్తువుల విషయానికి వస్తే ఫర్నిచర్‌, ఎలక్ట్రిక్‌ స్విచ్‌లు, ప్లాస్టిక్‌ పైపుల ధరలపై కౌన్సిల్‌ సమీక్ష జరపవచ్చునని అధికారులు వివరించారు.
Tags:    

Similar News