ఏపీకి మళ్లీ అన్యాయం చేసిన కాంగ్రెస్

Update: 2016-05-14 10:40 GMT
 ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య రసకందాయమైన ఆటగా మారిపోయింది. ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటూనే గట్టిగా అడగని టీడీపీ... విభజనకు ముందు పదేళ్లు ఇవ్వాలని పట్టుబట్టి తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ఊసెత్తని బీజేపీ... ఇస్తామని నోటిమాటగా చెప్పి దాన్ని చట్టం చేయని కాంగ్రెస్... ఇంకా, ఈ విషయంలో టీడీపీని ఎన్నిరకాలుగా విమర్శించడానికి వీలవుతుందా అని నిత్యం లెక్కలేసుకునే వైసీపీల మధ్య ప్రత్యేక హోదా అంశం నలిగిపోతోంది. ఎవరు ఎన్ని చేసినా, ఎన్ని మాటలు చెప్పినా అందులో చిత్తశుద్ధి మాత్రం కనిపించడం లేదు. ఎవరికి వారు రాజకీయ ప్రయోజనాల కోసం ఎత్తుగడలు వేయడమే తప్ప నిజంగా ప్రత్యేక హోదా సాధించడానికి ఏం చేయాలో.. ఏం చేయొచ్చో ఆ పనులు మాత్రం చేయడం లేదు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రయివేటు మెంబర్ బిల్లు పెట్టి ఒక అడుగు ముందుకేసినా దానిపై చర్చ సాగడం లేదు.. ఒక కొలిక్కి వచ్చే సూచనలూ కనిపించడం లేదు. కానీ... కాంగ్రెస్ ప్రయివేటు మెంబర్ బిల్లు పెట్టాలనుకున్నప్పుడు ఆపని కేవీపీతో కాకుండా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో చేయించి ఉంటే ఇంకా ప్రభావవంతంగా ఉండేదన్న వాదన వినిపిస్తోంది.

 ఆంధ్రప్రదేశ్ ను విభజించిన నాటికి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారు. ఏపీ ప్రత్యేక హోదా ఇస్తామని ఆయన హామీ ఇచ్చినా దాన్ని చట్టంలో పొందుపర్చలేదు. దాంతో చట్టరూపంలో లేదు కాబట్టి అమలులో ఇబ్బందులున్నాయంటూ బీజేపీ ప్రభుత్వం దొంగ మాటలు చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయివేటు మెంబర్ బిల్లు పెట్టడమన్నది కాంగ్రెస్ వేసిన గొప్ప ఎత్తుగడే అని చెప్పుకోవాలి. కానీ, అందుకు ఇంకా పకడ్బందీగా చేసుంటే దానికి అర్థం ఉండేది. ప్రయివేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు దానికి ఆమోదం లభిస్తే దాన్ని చట్టం చేయొచ్చు. భారత దేశ చరిత్రలో ఘనత వహించిన శారదా చట్టం ఇలా ఏర్పడినదే అని చెబుతారు. స్వాతంత్ర్యానికి పూర్వమే 1929లో బాల్య వివాహాల నిరోధానికి ఉద్దేశించి అప్పటి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు రాయ్ సాహెబ్ హర్ విలాస్ శారదా ఈ బిల్లును ప్రయివేటు మెంబరు బిల్లుగానే ప్రవేశపెట్టారు. అది సభలో ఆమోదం పొందడంతో దాన్ని సెలక్ట్ కమిటీకి పంపి చట్టం చేశారు. ప్రయివేటు మెంబర్ బిల్లుకు ఉన్న పవర్ కు శారదా చట్టాన్ని మించిన ఉదాహరణ లేదు. ఇప్పుడు ఏపీ ప్రత్యేకహోదా విషయంలోనూ ప్రయివేటు మెంబర్ బిల్లు నెగ్గితే ఇది కూడా చరిత్రకెక్కుతుంది. అయితే.. దాన్ని కేవీపీ కాకుండా మన్మోహనే స్వయంగా ప్రవేశపెడితే ఇంకా ప్రభావవంతంగా ఉండేది.

 ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన ప్రధానిగా మన్మోహన్ ప్రయివేటు మెంబర్ బిల్లు పెడితే సభలో మిగతా పార్టీలు - ఏపీలోని పార్టీలు అన్నీ ఇరుకునపడేవి. పైగా కాంగ్రెస్ తన చిత్తశుద్ధిని చూపించుకున్నట్లయ్యేది. మన్మోహన్ కూడా తానిచ్చిన హామీకి కట్టుబడి పదవిలో లేకున్నా ప్రయత్నం చేసినట్లుగా ఉండేది. కానీ, అలా జరగలేదు. మొక్కుబడిగా కేవీపీ దాన్ని ప్రవేశపెట్టేసరికి ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇతర రాష్ట్రాల నేతలు - ఇతర రాష్ర్టాల్లోని పార్టీల దృష్టిని ఇది పెద్దగా ఆకర్షించలేదు. అదే మాజీ ప్రధానిగా మన్మోహన్ దాన్ని ప్రవేశపెడితే పరిస్థితులు వేరేగా ఉండేవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి అందివచ్చిన మరో అవకాశాన్ని కూడా పాడు చేసి కాంగ్రెస్ మరోసారి ఏపీకి అన్యాయం చేసిందనే చెప్పాలి.
Tags:    

Similar News