కాంగ్రెస్ నేత మాట.. రేప్ జరిగితే చచ్చిపోవాలి

Update: 2020-11-03 07:30 GMT
ఆయన ఇండియాలో అత్యంత సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీకి ఒక రాష్ట్రంలో అధ్యక్షుడు. బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్నాడు. అలాంటపుడు ప్రతి మాటా జాగ్రత్తగా, బాధ్యతతో మాట్లాడాలి. కానీ ఆవేశంలో నోరు జారాడు. మహిళల గురించి దారుణమైన వ్యాఖ్య చేశాడు. తాను తప్పుగా మాట్లాడుతున్నట్లు కూడా ఆయనకు అనిపించలేదు. ప్రసంగాన్ని ముగించి తన సీట్లోకి వెళ్లిపోయాడు. ఐతే ఆయన వ్యాఖ్యల గురించి కాసేపటికే వెబ్ సైట్లలో వార్తలొచ్చేశాయి. దుమారం రేగింది. ఆ వార్తల్ని పక్కనున్న ఒక నేత చూపించడంతో ఆ నాయకుడు అప్రమత్తం అయ్యాడు. మళ్లీ మైక్ అందుకుని తన వ్యాఖ్యల గురించి వివరణ ఇచ్చాడు. క్షమాపణ చెప్పాడు. కేరళలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్ ఓ సభలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల తాలూకు దుమారం ఇది.

తిరువనంతపురంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఓ సభలో రామచంద్రన్ మాట్లాడుతూ.. తమ పార్టీకి వ్యతిరేకంగా ఒక మహిళతో ముఖ్యమంత్రి విజయన్ కుట్రపూరితంగా ఆరోపణలు చేయిస్తున్నాడని ప్రస్తావించాడు. ఆ మహిళ తాను పదే పదే అత్యాచారానికి గురైనట్లు చెబుతోందని.. కానీ ఒక మహిళ ఒక్కసారి మాత్రమే అత్యాచారానికి గురవుతుందని.. నిజంగా ఆత్మాభిమానం ఉన్న మహిళ ఒకసారి అత్యాచారానికి గురైతే చచ్చిపోతుందని లేదంటే మళ్లీ అత్యాచారానికి గురి కాకుండా చూసుకుంటుందని రామచంద్రన్ వ్యాఖ్యానించారు. అత్యాచారానికి గురైన మహిళలు చచ్చిపోవాలనే అర్థం వచ్చేలా రామచంద్రన్ మాట్లాడటంతో దుమారం రేగింది. కాసేపట్లోనే ఈ వ్యాఖ్యల తాలూకు వీడియో వైరల్ అయిపోయింది. మీడియాలో సంబంధిత వార్తలు హోరెత్తిపోయాయి. ఐతే ఆ సభలో ఉండగానే పక్కనున్న నాయకుడు మొబైల్ తీసి దీని గురించి వచ్చిన వార్తలు చూపించడంతో రామచంద్రన్ అలెర్టయ్యారు. మళ్లీ మైక్ అందుకుని తన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పారు.
Tags:    

Similar News