మూడేళ్ల త‌ర్వాత జ‌గ‌న్ ప్ర‌భుత్వం తెచ్చిన మ‌రో కొత్త స్కీమ్ ఇదే!

Update: 2022-07-12 05:38 GMT
విదేశాల్లో విద్య‌న‌భ్య‌సించాల‌నుకునే వారి కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌రో కొత్త ప‌థ‌కాన్ని తెచ్చింది. దీనికి జ‌గ‌న‌న్న విదేశీ విద్యా దీవెన అని పేరుపెట్టారు. దీనికి సంబంధించి తాజాగా ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది. ఏ ప‌క్ష‌పాతం లేకుండా ప్ర‌తిభ ఉన్న‌ విద్యార్థుల‌కు ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేస్తామ‌ని జ‌గ‌న్ స‌ర్కార్ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలవారికీ జ‌గ‌న‌న్న విదేశీ విద్యా దీవెన్ వ‌ర్తిస్తుంది. క్వాక్వ‌రెల్లి సైమండ్స్ (క్యూఎస్‌) వ‌ర‌ల్డ్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని మొదటి 200 యూనివర్శిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చును తామే భ‌రిస్తామ‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. మొదటి 100 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్సిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామ‌ని వెల్ల‌డించింది. 100పైబడి 200 లోపు ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్సిటీల్లో సీట్లు సాధిస్తే రూ.50 లక్షలు వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ వ‌ర్తిస్తుంద‌ని పేర్కొంది.

పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఏడాది వారీగా లేదంటే.. సెమిస్టర్‌ వారీగా కోర్సు పూర్తయ్యేంతవరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపు ఉంటుంది. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్త‌ర్వుల్లో తెలిపింది. టాప్‌ 200 యూనివర్సిటీల్లో సీట్లు సాధించిన‌వారంద‌రికీ సంతృప్తకర స్థాయిలో జగనన్న విదేశీ దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తారు.

విదేశాల్లో విద్యాభ్యాసం చేయాల‌నుకునేవారికి వయసు.. 35 ఏళ్లలోపు ఉండాలి. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెంది ఉండాలి. ఒక కుటుంబంలో ఒక‌రికి మాత్ర‌మే జ‌గ‌న‌న్న విదేశీ విద్యా దీవెన అందుతుంది. ఏటా సెప్టెంబర్‌–డిసెంబర్‌, జనవరి–మే మధ్య అర్హుల గుర్తింపు కోసం ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నేతృత్వంలోని కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది.

కాగా నాలుగు వాయిదాల్లో.. నేరుగా విద్యార్థుల‌ బ్యాంకు ఖాతాల్లోకి ఫీజురీయింబర్స్‌మెంట్ విడుద‌ల చేస్తారు. సంబంధిత దేశంలో విద్యార్థులు దిగిన‌ట్టు ల్యాండింగ్ పర్మిట్‌ లేదంటే ఐ–94 ఇమ్మిగ్రేషన్‌ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లింపును ప్ర‌భుత్వం జమ చేస్తుంది. ఫస్ట్‌సెమిస్టర్‌ లేదా టర్మ్‌ ఫలితాలు రాగానే ఫీజు రెండో వాయిదా చెల్లిస్తుంది.

అలాగే.. రెండో సెమిస్టర్‌ ఫలితాలు రాగానే మూడో వాయిదాను, నాలుగో సెమిస్టర్‌ లేదంటే ఫైనల్‌ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా చెల్లింపును పూర్తి చేస్తుంది. ఈ మేర‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.
Tags:    

Similar News