కవిత పేరుతో కేసీఆర్ కు కొత్త చిక్కు?

Update: 2022-12-03 03:02 GMT
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం సెగ తెలంగాణకు తగలటం ఒక ఎత్తు అయితే.. ఈ ఎపిసోడ్ తో ఇప్పుడు కొన్ని కొత్త పరిమితులు తెలంగాణ రాష్ట్ర సమితికి ఎదురైనట్లుగా చెబుతున్నారు. ఇంతకాలం తెలంగాణ సెంటిమెంట్ తమకు మాత్రమే సొంతమైనట్లుగా వ్యవహరించిన టీఆర్ఎస్ కు ఇకపై అలాంటి పరిస్థితులు ఉండవంటున్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే వైఎస్సార్ సీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేయటం తెలిసిందే. ఆంధ్రా.. తెలంగాణ అన్న బేధ భావం చూపించే వేళ.. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ సతీమణి ఆంధ్రా ప్రాంతానికి సంబంధించిన వారు అన్న మాట ఆమె నోటి నుంచి రావటం తెలిసిందే.

షర్మిల నోటి నుంచి వచ్చిన మాట.. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి వినిపించినా.. దాన్ని ఇంత ఓపెన్ గా మాట్లాడిన వారు ఎవరూ లేదు? ఇదిలా ఉంటే.. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరును ఈడీ అధికారులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొనటం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంబంధం ఉందని అనుమానిస్తున్న అమిత్ అరోడాను అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరుపర్చిన సందర్భంగా సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కవిత పేరు బయటకు వచ్చింది.

పేరు రావటం వరకు ఓకే కానీ.. ఆమె పేరుతో పాటు మరికొన్ని పేర్లు బయటకు రావటమే ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. దీనికి కారణం.. లిక్కర్ స్కాంలో కవితతో పాటు.. ఆమెకు సంబంధించిన కంపెనీగా చెబుతున్న దానికి సంబంధించి.. ఏపీకి చెందిన వారే ఉండటం ఇబ్బందికరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొత్తగా తీసుకొచ్చే మద్యం పాలసీకి సంబంధించి అక్కడి అధికారపక్షమైన ఆమ్ ఆద్మీకి చెందిన నేతల కోసం రూ.100 కోట్ల ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

ఈ ముడుపుల్ని సౌత్ గ్రూప్ నకు సంబందించిన విజయ్ నాయర్ కు ఇచ్చారని చెబుతున్నారు. ఇంతకూ ఈ గ్రూపు లో భాగస్వామ్యులు ఎవరన్నది చూస్తే.. తెలంగాణ ఎమ్మెల్సీ కవితతో పాటు.. ఏపీకి చెందిన శరత్ చంద్రారెడ్డి.. మాగుంట శ్రీనివాసుల రెడ్డిలకు సంబంధించినదిగా చెబుతున్నారు. నోరు తెరిస్తే తెలంగాణ.. ఆంధ్రా అంటూ తేడా చూపిస్తూ.. తెలంగాణ ప్రయోజనాల కోసం తాము పని చేస్తున్నట్లు చెప్పే అధికార పక్షానికి చెందిన ఇంటి మహిళ.. ఏపీకిచెందిన వారితో కలిసి వ్యాపారాలు ఎలా చేస్తారు? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఈ వ్యవహారం గులాబీ బాస్ కు కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టేలా మారటమే కాదు.. ఆంధ్రా.. తెలంగాణ అన్న వాదనకు సంబంధించి పవర్ ఫుల్ అస్త్రాన్నిబయటకు తీయలేని పరిస్థితికి తెచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రయోజనాల కోసమే పని చేసే వేళ.. ఏపీకి చెందిన మద్యం వాపారులతో కలిసి వ్యాపారం చేసే అంశాన్ని ఎలా సమర్థించుకుంటారు? అన్న ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News