కశ్మీర్ ఫైల్స్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాట్ కామెంట్స్

Update: 2022-03-25 04:33 GMT
కశ్మీర్ పండిట్ల వెతలను కళ్లకు కట్టినట్టు చూపించిన ‘కశ్మీర్ ఫైల్ ’ సినిమాను దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. బీజేపీ దీన్ని ఓన్ చేసుకొని రాయితీలు ఇచ్చి మరీ ఈ సినిమాను ప్రోత్సహిస్తున్నారు. ఇక ప్రతిపక్షాలు కొన్ని వర్గాలు ఈ సినిమాపై విమర్శల వాన కురిపిస్తున్నాయి. ఈ మూవీపై బీజేపీ కావాలనే ప్రేమ ఒలబోస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ‘కశ్మీర్ ఫైల్స్ ’కాదు.. మనకు అభివృద్ధి ఫైల్స్ కావాలని పిలుపునిచ్చాడు.  

తాజాగా ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ సైతం ‘కశ్మీర్ ఫైల్స్’ పై మండిపడ్డారు. కశ్మీర్ పండిట్ల పేరుతో కొందరు వ్యక్తులు కోట్లు కొల్లగొడుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు ఏమో పోస్టర్లు అంటించేపనిలో పడ్డారని కామెంట్ చేశారు. దర్శకుడు అగ్నిహోత్రి కశ్మీర్ పండిట్ల పేరు చెప్పుకొని కోట్లు సంపాదించాడని విమర్శించారు. బీజేపీ నేతలు ఈ సినిమా ద్వారా చక్కగా ప్రచారం చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలి. ఇకనైనా కళ్లు తెరవండి అంటూ కేజ్రీవాల్ హితవు పలికారు.

కశ్మీర్ ఫైల్స్ సినిమాకు బీహార్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా, హర్యానా, త్రిపుర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వినోద పన్ను మినహాయించారని.. సినిమా మంచి వసూళ్లు సాధిస్తోందన్నారు.  కానీ దీన్ని బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆ మేరకు కౌంటర్ వేశారు.

సినిమాను స్టడీ తీశానని.. ఏదీ కల్పితం కాదని.. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి అంటున్నారు. అందుకే జనం నీరాజనం పడుతున్నారు. కానీ కేసీఆర్, కేజ్రీవాల్ మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారు.

కశ్మీర్ ఫైల్స్.. దాదాపు 12 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రంపై ప్రధాని నరేంద్రమోడీ సైతం ప్రశంసలు కురిపించారు. అయితే తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఈ భేటిలో తొలి సెషన్ లో మాట్లాడిన కేసీఆర్ ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమాను కూడా ప్రస్తావించారు.ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సమస్యలు పక్కదారి పట్టించడానికే ఈ సినిమా విడుదల చేశారని ఆయన ఆరోపించారు. కాశ్మీర్ లో హిందూ పండిట్లను చంపినప్పుడు అధికారంలో ఉంది ఎవరు? అని ప్రశ్నించారు. అప్పుడు బీజేపీ ప్రభుత్వమే అధికారంలో లేదా? అని కేసీఆర్ నిలదీశారు.రైతుల సమస్యలు పక్కదోవ పట్టించడానికి ఈ సినిమాను తెరపైకి తెచ్చారని కేసీఆర్ విమర్శించారు. ఇక దేశానికి కావాల్సింది కాశ్మీర్ ఫైల్స్ కాదని.. డెవలప్ మెంట్ ఫైల్స్ అని సూచించారు. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా విమర్శలు చేయడంతో ఈ సినిమాపై రాజకీయంగా విమర్శల వాన కురుస్తోంది.
Tags:    

Similar News