కోడి పందేల‌పై చిన‌రాజ‌ప్ప కీల‌క ప్ర‌క‌ట‌న‌

Update: 2017-12-22 10:17 GMT
సంక్రాంతి అన్నంత‌నే ముచ్చ‌ట‌గా మూడు రోజుల పండ‌గ‌తో పాటు.. రంగ‌వ‌ల్లులు.. కోడిపందేలు ఇట్టే గుర్తుకు వ‌స్తాయి. అయితే.. త‌మ సంస్కృతికి త‌గ్గ‌ట్లు కోడి పందేల మీద ప‌రిమితులు విధించ‌టం స‌రికాద‌న్న ఆగ్ర‌హాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తుంటారు. ప్ర‌తి ఏటా సంక్రాంతికి ముందు కోడి పందేల మీద ఏదో ఒక వివాదం తెర మీద‌కు రావ‌టం.. అధికారులు  ప్ర‌క‌ట‌న‌లు చేయ‌టం.. వాతావ‌ర‌ణం వేడెక్క‌టం.. రాజ‌కీయ నేత‌లు ఎంట్రీ కావ‌టం.. మొత్తంగా పండ‌క్కి చ‌ట్టాల్ని ప‌క్క‌న పెట్టేసి.. తాము కోరుకున్న రీతిలో పందేలు నిర్వ‌హించుకోవ‌టం క‌నిపించేదే.

ఈసారి అలాంటి అవ‌కాశం లేకుండా ఏపీ హోంమంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సంక్రాంతికి మూడు రోజుల పాటు కోడి పందేలు నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని తేల్చేశారు. అయితే.. చ‌ట్టాల్ని గౌర‌విస్తూ.. సంస్కృతి సంప్ర‌దాయాల్ని కాపాడుకోవాల్సిన బాధ్య‌త అంద‌రి మీద ఉంటుంద‌న్న వ్యాఖ్య చేశారు.

చిన‌రాజ‌ప్ప ప్ర‌క‌ట‌న‌తో ఈ సంక్రాంతికి ఏపీలో కోడి పందేలు భారీ ఎత్తున సాగ‌టం ఖాయ‌మంటున్నారు. విడిగా అయితే అధికారుల ప‌రిమితుల మ‌ధ్య సాగే పోటీల‌కు భిన్నంగా.. సాక్ష్యాత్తు రాష్ట్ర హోంమంత్రే ఓకే అనేయ‌టంతో ఈసారి సంక్రాంతికి కోడి పందేలు పెద్ద ఎత్తున సాగుతాయ‌ని అంటున్నారు. హోంమంత్రే మూడు రోజులు అని క్లియ‌ర్ చేసిన త‌ర్వాత.. ఒక‌ట్రెండు రోజులు అద‌నంగా ఆడితే ఎవ‌రు మాత్రం ఏమంటార్లే అన్న భావ‌న ప‌లువురి నోట వినిపిస్తోంది. మ‌రి.. దీనిపై కోర్టులు ఎలా రియాక్ట్ అవుతాయో..?
Tags:    

Similar News