జ‌గ‌న్‌తో ఓకే కానీ, ఆయ‌న‌తో మా వ‌ల్ల‌కాదు.. తేల్చి చెప్పేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు

Update: 2022-12-15 13:30 GMT
ఏపీ అధికార పార్టీ వైసీపీలో పెద్ద ఎత్తున ఓక కీల‌క విష‌యం చ‌ర్చ‌గా మారింది. సీఎం జ‌గ‌న్‌తో త‌మ‌కు బాగానే ఉంద‌ని.. కానీ, ఒక కీల‌క నేత‌, ప్ర‌జాప్ర‌తినిధి కాక‌పోయినా.. అన్నీ తానే అయి వ్య‌వ‌హ‌రిస్తున్న నెంబ‌ర్ 2 గా పిలుచుకునే వ్య‌క్తి వ‌ల్ల త‌మ‌కు ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని.. ఆయ‌నతో త‌మ వ‌ల్ల‌కాద‌ని.. వైసీపీ ఎమ్మెల్యేలు గ‌గ్గోలు పెడుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఫేస్ చూసి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు గెలిచారు.

జ‌గ‌న్ పాద‌యాత్ర చేయ‌డం.. ఆయ‌న‌ పై ఉన్న సానుభూతి...ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ..ప్ర‌జ‌ల‌కు పిలుపునివ్వ‌డం.. దీనికి తోడు వైఎస్ బొమ్మ ఇలా అనేక విష‌యాలు క‌లిసివ‌చ్చి..  భారీ విజ‌యాన్ని న‌మోదు చేశారు. అధికారం లోకి వ‌చ్చిన త‌ర్వాత మంత్రి వ‌ర్గంలో ప్ర‌యోగాలు సైతం చేశారు. సోష‌ల్ ఇంజ‌నీరింగ్ అనే కాన్సెప్ట్ తీసుకువ‌చ్చి.. దాదాపు అన్ని వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. అదే స‌మ‌యంలో రెండున్న‌రేళ్ల లో మంత్రి వ‌ర్గాన్ని పూర్తిగా మారుస్తాన‌ని చెప్పారు.

 -అయితే, కొంద‌రిని ఉంచి మ‌రికొంద‌రిని కొత్త‌గా తీసుకున్నారు. వారిలో జూనియ‌ర్లు.. సీదిరి - ర‌జ‌నీ - గుడివాడ వంటివారు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఏపీ రాజ‌కీయాల‌కు ఆయువు ప‌ట్టు అయిన‌.. గుంటూరు జిల్లాలో ఫ‌స్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే ర‌జ‌నీ కి కీల‌క‌మైన వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చి.. అదేస‌మ‌యంలో నాలుగు నుంచి ఐదు సార్లు గెలిచిన వారికి మొండి చేయి చూపించారని పార్టీలోనే చ‌ర్చించుకుంటున్నారు.

ఇలా.. జూనియ‌ర్‌కు ఛాన్స్ ఇవ్వ‌డం వెనుక పార్టీలో హైక‌మాండ్ వెనుక చ‌క్రం తిప్పుతున్న‌ పెద్ద మ‌నిషి ఒక‌రు ఉన్నార‌ని అంటున్నారు. ఈ విష‌యంపై మంత్రులే లోలోప‌ల అనుకుంటున్నారు.

అయితే.. ఇప్పుడు ఎమ్మెల్యేల ప‌రిస్థితి గ‌డ‌ప గ‌డ‌ప కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని ఎంత బాగా చేస్తున్నా.. మా రిపోర్ట్స్ జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కి వెళ్ల‌డం లేద‌ని, మ‌ధ్య‌లో స‌ద‌రు పెద్ద మ‌నిషి.. ఎడిట్ చేస్తున్నార‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది.

గ‌తంలో కూడా 2019 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే సీట్లు చాలా మంది జూనియ‌ర్ల‌కు.. ముక్కు మొహం కూడా తెలియ‌ని వారికి ఇచ్చార‌ని అంటున్నారు. అయితే, అప్ప‌టి జ‌గ‌న్ వేవ్‌లో వారంతా విజ‌యం ద‌క్కించుకున్న‌ట్టు చెబుతున్నారు. ఒక‌సారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎమ్మెల్య‌ల మీద ప్ర‌భుత్వం మీద‌, కొంత వ్య‌తిరేక ఓటు పెరుగుతుంది. అది చూపించి.. మాకు ఎక్క‌డ సీట్లు ఎగ్గొడ‌తారో.. అని పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు.. ఆందోళ‌న చెందుతున్నార‌ని తెలుస్తోంది.

దీనికి ఆ పెద్ద మ‌నిషే కార‌ణ‌మ‌ని కూడా అంటున్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తో మాకు ఏమీ ఇబ్బంది లేదు కానీ, ఆ పెద్ద మ‌నిషితోనే మాకు ప‌డ‌డం లేద‌ని చాలా మంది చెబుతున్నారు. ఆయ‌న చెప్పిన‌ట్టు సీఎం జ‌గ‌న్ చేస్తే.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నించ‌కుండా ముందుకు వెళ్తే.. చాలా మంది ఓడిపోతార‌ని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News