ఏపీలో బీజేపీకి ఒక శాతం ఓట్లు...25 ఎంపీ సీట్లు

Update: 2022-06-14 09:32 GMT
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత బలంగా ఏపీలో బీజేపీ ఉందా అంటే జవాబు అవును అని వస్తోంది. ఏపీలో పాతిక దాకా ఎంపీ సీట్లు ఉన్నాయి. అవి గుత్తమొత్తంగా కలిపి బీజేపీకే చెందుతాయన్నది అందరికీ తెలిసిన మాట. కావాలంటే వచ్చే నెలలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలు చూడండి. ఏపీలో వైసీపీకి 22 ఎంపీ సీట్లు ఉంటే టీడీపీకి మూడు సీట్లు ఉన్నాయి. ఇంతమందీ కలసి ఓటేసేది బీజేపీ నిలబెట్టే రాష్ట్రపతి అభ్యర్ధిదే. అందువల్ల ఏపీ విషయంలో బీజేపీ బేఫికర్ గా ఉంది అంటున్నారు.

ఇక కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ దేశంలో బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రం ఏపీ మాత్రమే అని కచ్చితంగా చెప్పారు. ఆయన తమాషాకో మరోదానికో ఈ మాట చెప్పలేదు. గత ఎనిమిదేళ్ళుగా ఏపీలో జరుగుతున్న అనేక రాజకీయ  పరిణామాలు, ఏపీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న రాజకీయ పార్టీలు అన్నీ కలసి బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలో పోటీ పడుతున్న వైనాన్ని చూసి అన్న మాటలు ఇవి.

ఇక ఈ ఎనిమిదేళ్ళలో జరిగిన పరిణామాలు ఒక్కోటిగా చెప్పుకుంటే ఈ పార్టీలన్నీ ఎలా బీజేపీకి దాసోహం అన్నాయో తెలుస్తుంది. ముందుగా చూస్తే విభజన అనంతరం ఏపీలో గద్దెనెక్కిన చంద్రబాబు కేంద్రంతో దోస్తీ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ద్వారా ముంపునకు గురి అయ్యే ఏడు మండలాలను ఏపీలో కలిపితేనే ప్రమాణం చేస్తాను అని బీజేపీ పెద్దలకు తెగేసి చెప్పాను అని చెప్పిన బాబు ఆనక ప్రత్యేక హోదాను బీజేపీ పెద్దలు ఒడుపుగా  మడతేసినా ఏమీ మాట్లాడలేదు సరికదా ప్యాకేజీ ముద్దు అని కొత్త రాగం ఆలపించారు.

ఇక 2017లో బీజేపీ అభ్యర్ధులుగా నిలబడిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులకు ఆయన మద్దతు ఇచ్చి ఆ పార్టీని ఆకాశానికి ఎత్తేసారు. జీఎస్టీ బిల్లు సహా అనేక బిల్లులకు కూడా పూర్తిగా మద్దతు ఇచ్చారు. ఇక 2018లో బీజేపీతో చెడిన తరువాత కాంగ్రెస్ వైపు వచ్చి మోడీకి 2019 ఎన్నికల్లో ఎదురునిలిచిన చంద్రబాబు ఆ తరువాత ఓటమి పాలు కావడంతో మూడేళ్ళుగా బీజేపీ మీద పల్లెత్తుమాట అనడలేదు. ఆయన నోటి వెంట ప్రత్యేక హోదా సహా విభజన హామీలు ఏవీ రావడం లేదు. అంతే కాదు బంగారం లాంటి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలనుకున్నా కూడా బీజేపీని కనీసంగా బాబు ప్రశ్నించడంలేదంటే ఆయన మద్దతు ఎంత బలంగా ఉందో అర్ధం చేసుకోవాలి.

అంతే కాదు రేపటి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆయన బీజేపీకే మద్దతుగా తమ ఎంపీల చేత ఓటేయించడం ఖాయం. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకుంటే ఆయన సైతం పార్టీ పెడుతూనే బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఇక అనేక సందర్భాలలో ఆయన బీజేపీని పొగుడుతూ వచ్చారు. ఆ తరువాత ప్రత్యేక హోదా కంటే అందరి కంటే ఎక్కువగా మాట్లాడింది కూడా ఆయనే. పాచిపోయిన లడ్డూలు అని బీజేపీ ప్రత్యేక  ప్యాకేజీ మీద ఘాటు విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నిక‌లలో ఓడిన తరువాత విచిత్రంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. గడచిన మూడేళ్లలో ఆయన కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడింది లేదు.  ఇక విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఒక మీటింగ్ పెట్టిన పవన్ కళ్యాణ్ తప్పు అంతా వైసీపీదే అన్నట్లుగా మాట్లాడి వ్యూహాత్మకంగా వ్యవహరించారు తప్ప కేంద్రాన్ని మాత్రం కించిత్తు మాట అనలేదు.

వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తూ ప్రస్తుతం అలా ఉండిపోయారు అంటే బీజేపీకి ఇంతకంటే పెద్ద దన్ను వేరేగా కావాలా అన్నదే కదా చర్చ. ఇక అధికార వైసీపీ బీజేపీకి ఎంత ఎక్కువగా మద్దతు ఇస్తోంది అంటే ఆ పార్టీ ప్రత్యేక హోదానే తన రాజకీయ అస్త్రంగా మార్చుకుని 2019 ఎన్నికల్లో అదే అంశంగా చేసుకుని అధికారంలోకి వచ్చింది.

నాడు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా కాదు ప్యాకేజీ అని చెప్పిన తోడనే భగ్గుమన్న జగన్ ఏపీలో ఊరూ వాడా తిరిగి యువ భేరీలు రణభేరీలు నిర్వహించారు. టీడీపీ వారు బీజేపీకి అమ్ముడు పోయారు అని నానా విమర్శలు చేసిన జగన్ పాదయాత్ర సందర్భంగా చెప్పినది ఏంటంటే పాతికకు పాతిక ఎంపీ సీట్లు ఇస్తే బీజేపీ పెద్దల మెడలు వంచి అయినా సరే కచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకుని వస్తాను అని. కానీ 22 ఎంపీలను వైసీపీకి ఇచ్చినా కూడా మూడేళ్ళుగా ప్రత్యేక హోదా విషయంలో కిమ్మన‌ని దైన్యం వైసీపీది.

పైగా ఢిల్లీ వెళ్ళిన ప్రతీసారి వైసీపీ మద్దతు కేంద్రానికి ఉంటుందని బేషరతుగా చెప్పివస్తున్న వైనాలూ ఏపీ జనాలు చూస్తున్నారు. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీజేపీ వారికే వైసీపీ మద్దతు అన్నది లోకానికి పూర్తిగా తెలుసు. ఇలా ఏపీకి బీజేపీ ఏ సాయం చేయకపోయినా విభహన హామీలు తుంగలోకి తొక్కినా కూడా మూడు పార్టీలూ బీజేపీకి జై అంటున్నాయి.

మరి బీజేపీకి అంతలా జై కొడుతున్న ఈ పార్టీలు ఏపీలో బీజేపీకి అంత సీన్ ఉందని భావిస్తున్నాయా అంటే అబ్బే అదేమీ లేదు. ఏపీలో బీజేపీకి జీరో పాయింట్ 83 శాతం మాత్రమే ఓట్లు 2019 ఎన్నికల్లో లభించాయి. అంత తక్కువ స్థాయిలో నోటా కంటే తక్కువగా ఓట్లు వచ్చినా కూడా మూడు పార్టీలు పోటీలు పడి మరీ మద్దతుగా నిలవడమే ఇక్కడ పాయింట్. మొత్తానికి చూస్తే బీజేపీకి ఏపీ కంటే బలమైన స్టేట్ వేరేది ఉంటుందా అన్నదే కదా అందరి మాట. పాతికకు పాతిక ఎంపీ సీట్లు బీజేపీవే. ఈ మూడు పార్టీలలో ఎవరు గెలిచినా బీజేపీకే ఆ సీట్లు. ఇందులో వేరేగా డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం కూడాలేదు. అందుకే ఉండవల్లి మాటలో సత్యాన్ని ఏపీ జనాలు బాధగా మౌనంగా అంగీకరిస్తున్నారు.
Tags:    

Similar News