మోడీ మాట లైట్...పవన్ రూట్ క్లియర్

Update: 2023-01-09 07:25 GMT
దేశానికి పెద్దాయన, బీజీయెస్ట్ పొలిటీషియన్. బలవంతుడైన ప్రధానమంత్రి. ఆయన అపాయింట్మెంట్ కోసం ముఖ్యమంత్రులు ఎందరో ఎదురుచూస్తారు. అలాంటి నరేంద్ర మోడీ ఏరి కోరి మరీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అపాయింట్మెంట్ ఇచ్చారు. దాదాపుగా ముప్పావుగంట సేపు ఏకాంత భేటీకి చాన్స్ ఇచ్చారు. అక్కడ వన్ టూ వన్ గా మీటింగ్ సాగింది. ఏమి మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియదు.

కానీ సీన్ కట్ చేస్తే కొన్నాళ్ళు పవన్ సైలెంట్ గా ఉన్నారు. ఆ మీటింగ్ తరువాత మీడియా ముందు కూడా ఉత్సాహాం చూపించలేదు. ఆ తరువాత జరిగిన సభలలో జనసేనకు ఓటేయాలని పిలుపు ఇచ్చారు. ఏపీలో జనసేన అధికారంలోకి వస్తుందని కూడా అన్నారు. దాంతో సింగిల్ ఫైట్ అని అంతా అనుకున్నారు.

అయితే మూడు నెలలు తిరగకుండానే పవన్ చంద్రబాబు వైపు తిరిగిపోయారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు తెలుగుదేశంతోనే అని చెప్పకనే చెప్పేశారు. దీంతోనే ఇపుడు రాజకీయ వర్గాలలో చర్చ సాగుతోంది. ఇంతకీ మోడీ పవన్ కి ఏమి చెప్పి ఉంటారు అని. ఒకవేళ తెలుగుదేశంతోనే జట్టు కడతామని మోడీ చెప్పినట్లు అయితే ఇన్ని నెలల వ్యవధి అవసరం లేదు కదా అని అంటున్నారు.

అంటే మోడీ తెలుగుదేశంతో పొత్తు వద్దు జనసేన బీజేపీ కలసిపోటీ చేయాలని ప్రతిపాదించి ఉంటారని కూడా అంటున్నారు. మరి అది నచ్చకనే ఇన్నాళ్ళ తరువాత పవన్ కళ్యాణ్ తన దారి తాను చూసుకున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో వెళ్తేనే తాను సేఫ్ జోన్ లో ఉంటానని పవన్ భావించారా అని కూడా అంటున్నారు.

వీటి సంగతి పక్కన పెడితే మోడీ వంటి పెద్దాయన రాజకీయ బలవంతుడు తెలుగుదేశంతో పొత్తు వద్దు అని చెప్పారే అనుకుంటే ఆయన మాటను లైట్ తీసుకుని మరీ పవన్ ఈ విధంగా వెళ్ళారా అన్నది కూడా ఆసక్తికరమైన చర్చ. దేశంలో మోడీ మాటకు ఎదురుచెబితే పర్యవసనాలు ఫలితాలు ఎలా ఉంటాయో పొరుగున ఉన్న కేసీయార్ ని చూస్తే అర్ధమవుతుంది అని చెబుతారు.

మరి మోడీకి ఇష్టం లేని పొత్తుకు పవన్ వెళ్తున్నారా, అలా వెళ్ళినా తానుగా ఏ రకంగా సమర్ధించుకోగలరు అన్నది కూడా మరో చర్చగా ఉంది. ఏపీలో అధికార వైసీపీ నిర్బంధ రాజకీయాలను చేస్తోందని, దాన్ని అడ్డుకునేందుకే చేతులు కలిపామని పవన్ చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికే మిత్రపక్షంగా ఉన్న బీజేపీతో ముందుగా  ఈ విషయం మీద చర్చ జరిపి ఆ పార్టీతో కలసి పోరాటం చేయాలి కదా అన్న ప్రశ్న కూడా ముందుకు వస్తుంది.

మరో వైపు చూస్తే ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలలో జనసేన ఎపుడూ బీజేపీతో తోడుగా ఉండడం లేదనే అంటారు. ఇపుడు బాబుతో మీటింగ్ ద్వారా పవన్ తన రాజకీయ విధానాలు క్లియర్ గా చెప్పేశారు అని అంటున్నారు. ఒక విధంగా బీజేపీ తన రూట్ మ్యాప్ తాను చూసుకోవాల్సి ఉంటుందని కూడా తేల్చేశారు అని అంటున్నారు.

మరి ఇపుడు ఏపీలో బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధపడుతుందా లేక జనసేన బాటలో తెలుగుదేశంతో కలుస్తుందా అన్నది కూడా పెద్ద ప్రశ్నగానే ఉంది. ఇపుడు బీజేపీ జనసేన వెనకాల వచ్చినా రాయబేరాలకు పెద్దగా చాన్స్ ఉండదు. పైగా తెలుగుదేశం అవసరాలు అన్నీ జనసేనతోనే అయినపుడు ఏదో మాకూ కొన్ని సీట్లు అని కమలనాధులు అడిగినట్లుగా ఉంటుంది తప్ప అందులో  తెలుగుదేశం  మీద వత్తిడి పెట్టే సీన్ ఉండదు.

ఇలా బీజేపీని పవన్ బాగా ఇరికించేశారు అని అంటున్నారు. మరి దీన్ని చూస్తూ బీజేపీ కేంద్ర పెద్దలు కానీ ఏపీ నేతలు కానీ ఊరుకుంటారా అని అంటున్నారు. వారి ముందు ఏ మార్గం ఉంది అన్నది కూడా ఆలోచించాల్సి ఉంది. జనసేన తమ మాట రూట్ చెప్పకనే చెప్పేశాక బీజేపీ చేస్తే ఒంటరిగా పోటీ చేయడం లేకపోతే ఈ కూటమిలో చేరి వారు చెప్పినట్లుగా చేయడమే చేయాలి.

నిజానికి బీజేపీ ప్లాన్ వేరేగా ఉంది అని అంటున్నారు. జనసేన తమతో కలసి ఉంటే ఎన్నికల వేళకు తెలుగుదేశాన్ని బెండ్ చేసి తాము కోరుకున్న సీట్లతో పాటు అధికార వాటాను కూడా డిమాండ్ చేయాలనుకుంది అంటున్నారు. కానీ ఇపుడు జనసేన  ఆ వైపుగా తేలడంతో కమలనాధులకు ఏమీ పాలుపోవడం లేదు అంటున్నారు.

వీటికి మించి మోడీ వంటి పెద్ద మనిషిని దించి పవన్ కి చెప్పాల్సింది చెప్పినా ఆయన బాబుతోనే అంటూంటే అది మోడీకి కూడా ఇబ్బందికరమే అని అంటున్నారు. మొత్తానికి విశాఖలో మోడీ పవన్ ల ఏకాంత భేటీని ఈ తాజా బాబు భేటీ ఏ మాత్రం ప్రాధాన్యత లేకుండా చేసింది అనే అంటున్నారు.
Tags:    

Similar News