మంత్రులను నిలదీస్తూ.... సరికొత్త యుద్ధానికి పవన్

Update: 2022-10-27 03:58 GMT
ఏపీలో మరో వార్ కి రంగం సిద్ధం అవుతోంది. తనకు ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు తీసుకుని కొడతాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే మంగళగిరి పార్టీ ఆఫీసులో ఘాటుగా మాట్లాడారు. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ మంత్రులు రంగంలోకి దిగి రివర్స్ అటాక్ చేశారు. ముమ్మాటికీ ప్యాకేజీ స్టార్ అనే అంటామని కూడా వారు పవన్ని రెచ్చగొట్టారు. ఆ ఎపిసోడ్ అలా ముగిసింది అని అంతా అనుకుంటున్న వేళ పోలవరం ఎపుడు పూర్తి అవుతుందో అరగంట ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలవా అంబటీ అంటూ పవన్ ఫోటో ట్వీట్ వేశారు.

దానికి పవన్ కళ్యాణ్ నాలుగవ వివాహం అయ్యేలోగా పోలవరం పూర్తి చేస్తామమి హామీ ఇస్తున్నానని అని అంబటి రాంబాబు కౌంటర్ వేశారు. అది అలా ఉండగానే మంత్రుల ఫోటోలతో ట్వీట్లు బాగున్నాయని అనుకున్నారో లేక ఇలా చేస్తే పంచులు అదిరిపోతాయని రాజకీయ రచ్చ కూడా పీక్స్ కి వెళ్తుంది అని భావించారో కానీ పవన్ వరసబెట్టి పలువురు వైసీపీ  మంత్రులను టార్గెట్ చేశారు.

అందులో కొందరుని బహువచనంతో మరికొందరిని ఏకవచనంతో సంభోదించారు. అదే టైం లో ముగ్గురు మంత్రులకు చెప్పు చూపిస్తూ ఫైర్ అయిన పవన్ ఫోటో పెడితే మిగిలిన వారికి నిలదీస్తున్న పవన్ ఫోటో పెట్టారు. పైగా ఆ మంత్రులను ప్రశ్నిస్తూ వారికి సెటైరికల్ గా బిరుదులు కూడా ఇచ్చారు.

అందులో మొదట ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఉన్నారు.  మీ పాలనలో  అప్పులు ఎన్ని చేశారో ప్రతీ పౌరుడి నెత్తిన ఎంత అప్పు ఉందో శ్వేతపత్రం విడుదల చేయగలరా బుగ్గనా అని పవన్ నిలదీశారు. ఆ తరువాత జోగి రమేష్ ని ఉద్దేశించి కొండలు గుట్టలు కాకుండా నివాసయోగ్యమైన చోట నాణ్యమైన ఇళ్ళు ఎన్ని కట్టించారో చెప్పగలవా జోగీ అని పవన్ ప్రశ్నించారు. అయితే ఇక్కడ ఆయనకు చెప్పుతో ఉన్న పవన్ ఫోటో చూపించడం విశేషం.

పాఠశాల విద్యార్ధులకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది ప్రజలకు అర్ధమయ్యే భాషలో వివరించగలరా  బొత్స అంటూ పవన్ నిలదీస్తున్న ఫోటో ఉంది. ఇందులో ఇన్వెర్టెడ్ కామాస్ లో అర్ధమయ్యే భాషలో అని రాశారు. అంటే బొత్స మాటలు ఎవరికీ అర్ధం కావు అన్న సెటైర్ ఉందన్న మాట.

ఇక గుడివాడ అమరనాధ్ నైతే పూర్తి ఏకవచనంతో సంభోదించారు. నీ రికార్డింగ్ డ్యాన్సులు అన్నీ అయిపోయాక ఖాళీగా ఉన్న సమయంలో ఏపీకి ఎన్ని పరిశ్రమలు తెచ్చావో శ్వేతపత్రం విడుదల చేయగలవా గుడివాడా అంటూ పవన్ ప్రశ్నించారు. అయితే ఇక్కడ కూడా చెప్పుతో ఉన్న పవన్ ఫోటో పెట్టడం విశేషం.

ఇక పర్యాటక రంగం అభివృద్ధికి నీవు చేసే బృహత్కార్యాలు ఏంటి మహానటీ అంటూ రోజాను ఏకవచనంతో సంభోదిస్తూ ఆమెకు మహానటి బిరుదు కూడా ఇచ్చేశారు పవన్. ఇక్కడ కూడా ఆయన నిలదీస్తున్న ఫోటో ఉంది. ఇంకెంతమందిని మీ గుంతల రహదార్లు బలి తీసుకుంటే తప్ప మొద్దు నిద్ర వీడుతావో చెప్పగలవా దాడిశెట్టి అంటూ పవన్ ఆ మంత్రిని నిలదీశారు. అయితే ఇక్కడ కూడా చెప్పుతోనే పవన్ ఫోటో ఉంది.

మీ సహచర మంత్రులు అనారోగ్యం పాలు అయి ఇతర రాష్ట్రాలకు పారిపోకుండా ఏపీలోనే వైద్యం చేయించుకునే వైద్య సదుపాయాలు ఏపీలో ఎపుడు కల్పిస్తారో చెప్పగలరా పబ్లిసిటీ క్వీన్ అంటూ విడదల రజనీకి సెటైర్లు వేశారు. ఇక్కడ ఆమెని పబ్లిసిటీ క్వీన్ గా చెప్పడం విశేషం.

మొత్తానికి పవన్ ట్విట్టర్ వేదికగా ఈ మంత్రులకు ప్రశ్నలు సంధించి సరికొత్త యుద్ధానికి తెర లేపారు. అయితే అందులో ముగ్గురు మంత్రుల మీద ఆయనకు కోపం టార్గెట్ వేరే లెవెల్ లో ఉందా అన్నట్లుగా చెప్పుతో ఉన్న ఫోటోలు చూపించారు. మరి దీని బట్టి పవన్ వైసీపీ మంత్రుల మీద గట్టిగానే ఫోకస్ పెట్టారని అర్ధమవుతోంది. చూడాలి మరి దీనికి వైసీపీ మంత్రులు ఎలా రియాక్ట్ అవుతారో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News