మధ్యాహ్నం నిద్రా.? మీరు గజని అయిపోతారు?

Update: 2019-08-14 05:25 GMT
మా తాత సాయంత్రం 6 అయ్యిందంటే చాలు కల్లు తాగి వచ్చేవాడు.. ఫుల్లుగా తిని రాత్రి 7 గంటలకే మంచమెక్కి పడుకునేవాడు. తెల్లవారి 4 గంటలకే బ్రహ్మ ముహూర్తాన లేచి సద్దన్నం తిని పొలం బాట పట్టేవాడు. మరి ఇప్పుడు సమాజం మారింది. ఉద్యోగాలు మారాయి. రాత్రి ఉద్యోగాలు పెరిగిపోయాయి. టీవీలు వచ్చిపడ్డాయి. సెల్ ఫోన్ల వ్యసనం. ఈ నేపథ్యంలో పట్టణాలు- పల్లెల్లో 12 గంటలు కానిది ఎవరూ పడుకోవడం లేదు.

ఇక యూత్- ఉద్యోగులైతే మందు చిందేసి ఏ రెండింటికో మూడింటికో బెడ్ పై వాలితే నాలుగు గంటల వరకు కునికిపాట్లు పడి నిద్దరోతారు. మధ్యాహ్నం 12 గంటలు కానిదే లేవరు. ఈపరిణామంతో రోగాలు కొనితెచ్చుకుంటున్నారు. వేళాపాళా లేని నిద్ర- ఆహారంతో పుట్టెడు రోగాలు చుట్టుముడుతున్నాయి.

ఇక మరికొందరేమో రాత్రి టీవీ షోలు- సినిమాలు- ఫోన్లో చాటింగ్ లతో మేల్కొని మధ్యాహ్నం తిని పడుకుంటారు. ఇది కొంపలు ముంచే వ్యవహారం అని తాజాగా పరిశోధకులు తేల్చారు. మధ్యాహ్నం పడుకునే వాళ్లకు ఇదో డేంజర్ బెల్ లాంటి వార్తను చెప్పారు అమెరికాలోని కాలిఫోర్నియా- శాన్ ఫ్రాన్సిస్ కో శాస్త్రవేత్తలు.

తాజాగా అమెరికన్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో మధ్యాహ్నం పడుకునే వారి మెదడు దెబ్బతిని అల్జీమర్స్ వ్యాధి (మతిమరుపు) సంక్రమిస్తుందని తేలింది. మధ్యాహ్నం పడుకోవడం వల్ల మనల్ని పగలు నిద్రపోకుండా ఉంచే మెదడులోని ప్రోటీన్లు మెదడుకు చేరడం లేదని.. ఫలితంగా మనల్ని మెలకువతో ఉంచే నాడీకణాలు చనిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఇది అల్జీమర్స్ వ్యాధికి కారణమవుతోందని తేల్చారు. సో మధ్యాహ్నం పడుకునే వారు పారాహుషార్. జరజాగ్రత్తగా ఉంటే మంచిదంటున్నారు పరిశోధకులు.
    

Tags:    

Similar News